తెలంగాణ రాష్ట్రసమితి తరపున రాజ్యసభ సభ్యునిగా ఉన్న ధర్మపురి శ్రీనివాస్ ( డీఎస్ ) కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. ఢిల్లీలో  సోనియా నివాసంలో దాదాపుగా నలభై ఐదు నిమిషాల సేపు సమావేశమయ్యారు.  తెలంగాణ రాజకీయ పరిస్థితులు.. కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. డీఎస్‌ను టీఆర్ఎస్ చాలా కాలంగా దూరం పెట్టింది. అయితే ఆయనను సస్పెండ్ చేయలేదు. నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలంతా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తీర్మానం చేసి హైకమాండ్‌కు ఇచ్చారు. కానీ కేసీఆర్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అప్పట్నుంచి డీఎస్ సాంకేతికంగా మాత్రమే టీఆర్ఎస్ సభ్యునిగా ఉన్నారు.


Also Read: శిల్పా చౌదరికి బెయిల్ మంజూరు... పక్కా స్కెచ్ తో రూ.కోట్లు కొట్టేసిందా?... శిల్ప కాల్ డేటా విశ్లేషిస్తోన్న పోలీసులు


డీఎస్ చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఆయన పార్టీలో చేరితే ఆయన పదవిపై అనర్హతా వేటు పడే అవకాశం ఉంది. ఈ కారణంగా గతంలో కూడా సోనియాతో భేటీ అయినప్పటికీ కాంగ్రెస్‌లో చేరలేదు. డీఎస్ రాజ్యసభ సభ్యత్వం వచ్చే ఏడాది ముగిసిపోనుంది. ఆ తర్వాత ఆయన ఫ్రీగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అందుకే తన రాజకీయ జీవితంలో అత్యధిక కాలం ఉన్న కాంగ్రెస్ పార్టీలోనే మళ్లీ చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా  చెబుతున్నారు. 


Also Read: ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ.. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో డీఎస్ చాలా కీలకమైన నేతగా ఉన్నారు. రెండు సార్లు పీసీసీ  చీఫ్‌గా చేశారు. ఆయన పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలోనే పార్టీ రెండు సార్లూ అధికారంలోకి వచ్చింది. మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆయన కేసీఆర్ పిలుపుమేరకు టీఆర్ఎస్‌లో చేరి రాజ్యసభ సభ్యుడయ్యారు. కానీ కొద్ది రోజులకే ఆయన అక్కడ ఇమడలేకపోయారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమయ్యారు. 


Also Read: Pushpa Movie: 'పుష్ప'కు కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్నది పెద్ద సాయమే...


ఇటీవల టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా డీఎస్‌తో సమావేశమయ్యారు. ఆయన కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతామని ప్రకటించారు. అయితే డీఎస్ రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. నిజామాబాద్ నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. అయినప్పటికీ తనకు రాజకీయంగా గుర్తింపు ఇచ్చిన కాంగ్రెస్‌లోనే డీఎస్ చేరాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.  


Also Read: Kamareddy: ఈ ఊర్లో లిక్కర్ అమ్మితే రూ.లక్ష, కొనాలంటే రూ.50 వేలు.. నాలుగేళ్ల నుంచి ఇంతే..


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి