నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి తొమ్మిదేళ్లు గడుస్తున్నా....నేటికి పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ చేయలేదు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్స్‌ సిబ్బందితోనే కాలం వెల్లదీస్తున్నారు. ప్రధాన విభాగాలతో పాటు విలువైన పరికరాలు అందుబాటులో ఉన్నా ఆ స్థాయిలో వైద్య సేవలు అందట్లేదు.


ప్రధాన విభాగాలు


మెడికల్‌, పీడియాట్రిషన్‌, రేడియాలజిస్టు, డీజీవో, ఆర్థో, డ్రగ్, డెంటల్, కంటి, సైక్రియాట్రిక్ విభాగం, సర్జికల్, ఈఎన్‌టీ, స్కిన్, అంకాలజీ, క్యాజువాలిటీలో 24 గంటలు ఒక వైద్యుడు అందుబాటులో ఉంటారు. దీంతో జిల్లా నలుమూలల నుంచి వచ్చే రోగులు డాక్టర్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోకి వెళ్లే స్తోమత లేని రోగులు దిక్కు తోచని స్థితిలో వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. ఎమర్జెన్సీ పేషెంట్ వస్తే ప్రాణాలు పోవాల్సిన దుస్థితి తలెత్తింది. సిటీస్కానింగ్‌, స్కానింగ్‌, డయాలసిస్‌, ఎస్‌ఎన్‌సీయూ, అత్యాధునిక రక్తపరీక్ష పరికరాలు, బ్లడ్ బ్యాంక్, ఆపరేషన్ థియేటర్లు, కొవిడ్ కు ప్రత్యేక ఐసీయూ అందుబాటులో ఉంది. అందుకు సరిపడా డాక్టర్లు, సిబ్బందే లేరు. 


అంతంతమాత్రంగానే సేవలు


రేడియాలజీ విభాగంలో సిటీస్కాన్‌తో పాటు స్కానింగ్‌ ఉంది. రోజు వంద మంది వరకు స్కానింగ్‌ కోసం వస్తుంటారు. రేడియాలజిస్టులు ఇద్దరే ఉండటంతో రోగులకు సరిపడా సేవలు అందడం లేదు. బ్లడ్ టేస్ట్, బ్లడ్ బ్యాంక్ లో ల్యాబ్‌టెక్నీషియన్ల కొరత ఉంది. సరిపడా సిబ్బంది లేక గతంలో 50 లక్షల విలువ చేసే అత్యాధునిక సీబీపీ యంత్రం పనికి రాకుండా పోయింది. ప్రస్తుతం సిటీస్కాన్‌ కూడా పని చేయడం లేదు. ఇక్కడ 27 మంది అనస్తిషియా పోస్టులు ఉండగా 10 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఆపరేషన్ అవసరమున్న పేషెంట్స్ కి సరైన సయమంలో ఆపరేషన్లు జరగటం లేదు.


సూపర్‌ స్పెషాలిటీ ఇంకెన్నడు


గుండె, మూత్రకోశ వ్యాధులు, న్యూరో వంటి సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుబాటులో లేకపోవడంతో పేదలు ప్రైవేటుకు పరుగులు తీసి అప్పుల పాలవుతున్నారు. కొవిడ్‌ తరువాత ఈ వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య పెరిగింది. గుండెకు సంబంధించిన సమస్యలు వస్తే ప్రైవేటు ఆసుపత్రులకు లేదా హైదరాబాద్‌కు వెళ్లక తప్పడం లేదు.


ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో మొత్తం విభాగాలు 25


వివిధ పరీక్షల విభాగాలు 8, ప్రస్తుతం ఉన్న డాక్టర్లు 200, ఇంకా భర్తీ కావాల్సిన డాక్టర్లు 111, పారామెడికల్‌, ఇతర సిబ్బంది 343, ఇంకా అవసరమైనవారు 433, పరికరాల విలువ మొత్తం`40 కోట్లు, నిత్యం ఆస్పత్రికి వచ్చే ఓపీ 800 నుంచి 900వరకు ఉంటోంది. రోజూ ఆసుపత్రిలో చేరుతున్న రోగులు సంఖ్య 80 నుంచి 90 వరకు ఉంటుంది. 2013-14లో జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని మెడికల్ కాలేజీగా అనుమతించాలని ఎంసీఐకు లేఖ రాశారు. అప్పట్లో వారు తనిఖీలకు వచ్చిన సమయంలో రోజువారి ఓపీ 400కు మించలేదు. ప్రస్తుతం ఓపీ 900 వరకు కొనసాగుతోంది. కొవిడ్‌కు ముందు 1,300కు చేరింది. 90 మందికి తగ్గకుండా నిత్యం ఆసుపత్రిలో చేరుతున్నారు.


నిజామాబాద్ జిల్లా నుంచే కాకుండా ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నుంచి అటు మహారాష్ట్ర నుంచి కూడా రోగులు ఇక్కడికి వైద్యం కోసం వస్తుంటారు. రోగులకు అనుగుణంగా డాక్టర్లు, సిబ్బంది లేక పోవటంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న డాక్టర్లు కూడా అందుబాటులో ఉండటం లేదంటున్నారు. ప్రస్తుతం ఉన్న డాక్టర్లు హైదరాబాద్ లోనే ఎక్కువ మంది ఉంటారు. ఇందులో చాలా వరకు వైద్యులు సరిగ్గా అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయ్. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు పట్టించుకని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సరిపడా డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.


Also Read: Crime News: బావ వేధింపులు తాళలేక వివాహిత సెల్ఫీ సూసైడ్... మరోచోట కానిస్టేబుల్ బెదిరింపులతో మహిళా వాలంటీర్ ఆత్మహత్య


Also Read: SBI Crime : కాల్ సెంటర్ పెట్టారు.. కోట్లు దోచారు ! అతి పెద్ద మోసగాళ్ల ముఠాను పట్టేసిన సైబరాబాద్ పోలీసులు...