Telangana Cyber Crime: సైబర్ క్రైం అనగానే మొదట గుర్తుకు వచ్చేది ఝార్ఖండ్ లోని జంతారా.. రాజస్థాన్ లో భరత్ పూర్. ఈ ఊర్లలో సైబర్ క్రైం నేరాలు కులవృత్తుల్లా చేస్తుంటారు. కుటుంబంలోని అందరూ కలిసి ఈ నేరాలకు పాల్పడుతుంటారు. నిర్మల్ లోని స్థానికులు అందరూ కలిసి బొమ్మలు తయారు చేస్తుంటారో, ఇంటింటికి కొయ్య బొమ్మల దుకాణాలు ఎలా ఉంటాయో.. జంతారా, భరత్ పూర్ ఊర్లలోనూ ఇంటింటికి సైబర్ క్రైం నేరగాళ్లు ఉంటారు. దేశంలో జరిగే అత్యధిక ఆన్ లైన్ మోసాల సూత్రధారులు, పాత్రధారులు ఇక్కడి నుంచే ఉంటారు. అంతగా ఈ ప్రాంతాలు సైబర్ నేరాలకు ఫేమస్ అయ్యాయి. అలాంటి తరహాలోనే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోనూ సైబర్ నేరగాళ్లు పురుడుపోసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. టెక్నాలజీపై పట్టు సాధించి.. సాంకేతిక తెలియని వారిని లక్ష్యంగా చేసుకుని లక్షలు, కోట్లలో కాజేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.


రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 20 వేల మందికిపైగా ప్రజలు మోసం చేసి.. దాదాపు 30 లక్షల రూపాయలు కాజేసిన 3 ముఠాలను తెలంగాణలోని సిద్దిపేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యులు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని బేగంపేట పోలీసులు ఈ సైబర్ క్రైమ్ మోసగాళ్లను అరెస్టు చేశారు. వీరు.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వేల మందిని మోసగించినట్లు గుర్తించారు. న్యూడ్ వీడియోలు, ఫోటోలు, సెక్స్ చాట్ లు చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. వీరి టార్గెట్ అంతా సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతున్న పురుషులే. మహిళల పేర్లతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తారు. ఆకట్టుకునే ఫోటోలను ప్రొఫైల్ పిక్ గా పెడతారు. వాటిని చూసి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపిన వారిని అలాగే వీరు మరికొందరికి పంపి క్రమంగా ముగ్గులోకి దించుతారు. 


పోలీసులు పట్టుకున్న వారిలో ఒక ముఠాలో ముగ్గురు డిగ్రీ విద్యార్థులు కాగా, మరొకరు మొబైల్ ఫోన్ దుకాణంలో పని చేసే వ్యక్తి ఉన్నారు. నలుగురు సభ్యులు కలిగిన రెండో ముఠాలో ఇద్దరు డిగ్రీ విద్యార్థులు, గ్రాడ్యుయేట్ గా మారిన రైతు, ప్రైవేట్ ట్రావెల్స్ యజమాని ఉన్నారు. ఈ రెండు ముఠాలు సుమారు మూడేళ్లుగా ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. షేర్ చాట్ యాప్ లో మహిళల పేర్లతో నకిలీ ప్రొఫైళ్లు సృష్టించారు. పురుషులతో స్నేహం చేస్తారు. తర్వాత వారితో చాటింగ్ మొదలు పెడతారు. వారికి న్యూడ్ ఫోటోలు, వీడియోలు పంపిస్తారు. వీడియో కాల్స్, నార్మల్ కాల్స్ చేస్తే కట్ చేసి ఏదో సాకు చెప్పి తప్పించుకుంటారు. పదే పదే కాల్ చేసే వారిని బ్లాక్ చేస్తారు. న్యూడ్ వీడియో కాల్ మాట్లాడాలంటే 500 నుంచి వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తారు. అలా దాదాపు 19 వేల మందిని మోసం చేసి దాదాపు 30 లక్షల వరకు కాజేసినట్లు పోలీసులు చెబుతున్నారు. 


జూన్ 20వ తేదీన ఇద్దరు సభ్యుల ముఠాను సిద్దిపేట జిల్లా బేగంపేటకు చెందిన పోలీసులు పట్టుకున్నారు. వీరు 5 వేల మందిని మోసం చేసి రూ. 9 లక్షలు కాజేసినట్లు పోలీసులు తెలిపారు. వీరు కూడా సోషల్ మీడియా ద్వారా పురుషులతో చాటింగ్ చేస్తారు. క్రమంగా వారికి న్యూడ్ ఫోటోలు పంపడం మొదలు పెడతారు. తర్వాత న్యూడ్ వీడియో కాల్ మాట్లాడదామంటూ ఉసిగొల్పుతారు. బాధితులు అదంతా నిజమని నమ్మి వీడియో కాల్స్ లో వస్త్రాలు తొలగించేదంతా స్క్రీన్ రికార్డు చేస్తారు. తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తారు. డబ్బులు ఇవ్వకపోతే వారి న్యూడ్ వీడియోలను తెలిసిన వారికి, బంధువులకు పంపిస్తామని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తారు. ఈ ఇద్దరు సభ్యుల ముఠాలో ఒకరు కాలేజీ డ్రాపవుట్ కాగా, మరొకరు డ్రైవర్.