Cricket Fan Entered Into Uppal Stadium While India and England Match: హైదరాబాద్‌ (Hyderabad) వేదికగా ఉప్పల్ (Uppal) స్టేడియంలో జరుగుతున్న ఇండియా, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ లో గురువారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) బ్యాటింగ్ చేస్తుండగా.. ఓ అభమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. విరాట్ కోహ్లీ జెర్సీ ధరించిన ఓ వ్యక్తి.. నేరుగా హిట్ మ్యాన్ దగ్గరకు వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించాడు. దీంతో క్రీజులో ఉన్న రోహిత్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి అలా చెయ్యొద్దని వారించారు. గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే మైదానం నుంచి అతన్ని బయటకు తీసుకెళ్లారు. అనంతరం సదరు అభిమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


246 పరుగులకు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగింపు


అటు, హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత స్పిన్నర్లు చెలరేగడంతో బ్రిటీష్‌ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. జడేజా, అశ్విన్‌ చెరో మూడు వికెట్లు తీయగా, అక్షర్‌ పటేల్‌ రెండు, బుమ్రా రెండు వికెట్లతో రాణించారు. పది వికెట్లలో ఎనిమిది వికెట్లను స్పిన్నర్లే తీశారు. ఇంగ్లండ్‌ బ్యాటర్లను టీమిండియా స్పిన్నర్లు ముప్పుతిప్పలు పెట్టారు. ఓపెనర్లు దూకుడుగా ఆడడంతో స్టోక్స్‌ సేన, 11 ఓవర్లకు 53 పరుగులతో పటిష్టంగా కనిపించింది. కానీ స్పిన్నర్ల రంగ ప్రవేశంతో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. అశ్విన్‌, జడేజా, అక్షర్‌ బౌలింగ్‌కు తోడు ఫీల్డర్లు అద్భుత క్యాచ్‌లు అందుకోవడంతో 155 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి, బ్రిటీష్‌ జట్టు కష్టాల్లో పడింది. కానీ, సారధి బెన్‌ స్టోక్స్‌ మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడి ఇంగ్లండ్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. 88 బంతుల్లో 70 పరుగులు చేసిన స్టోక్స్‌ను బుమ్రా వెనక్కి పంపడంతో... 246 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.


తొలిరోజు భారత్ ఆధిపత్యం


కాగా, తొలి రోజు భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత స్పిన్నర్లు ఇంగ్లాండ్‌ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగా, తర్వాత బ్యాటర్లు సాధికారికంగా బ్యాటింగ్‌ చేశారు. దీంతో తొలిరోజును భారత్‌ సంతృప్తిగా ముగించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో.. 246 పరుగులకు ఆలౌట్‌ అయింది. తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించారు. 24 పరుగుల వద్ద రోహిత్ వెనుదిరిగాడు. తొలి ఓవర్‌ నుంచి ధాటిగా ఆడిన యశస్వి జైస్వాల్‌ 70 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్సులతో 76 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. బ్రిటీష్‌ బౌలర్లపై ఆది నుంచి ఎదురుదాడికి దిగిన జైస్వాల్‌ విధ్వంసకర ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. యశస్వీకి తోడుగా 14 పరుగులతో గిల్‌ క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌- రవీంద్ర జడేజా జోడి అరుదైన రికార్డును నెలకొల్పారు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత జోడీగా వీరిద్దరూ నిలిచారు. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు 504 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు అనిల్‌ కుంబ్లే - హర్భజన్ సింగ్ 501 వికెట్లు తీయగా.. వీరిద్దరూ ఆ రికార్డును బద్దలు కొట్టారు. 


Also Read: TSPSC New Chairman: TSPSC ఛైర్మన్ గా మహేందర్ రెడ్డి నియామకం - ప్రభుత్వ నిర్ణయానికి గవర్నర్ ఆమోదం