రాష్ట్రంలో కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు ఖరారైంది. సీపీఐకి కొత్తగూడెం సీటు, మరో ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మునుగోడులో ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉండే అవకాశం ఉంది. అయితే, మునుగోడులో పోటీ వద్దని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచించగా, మరోసారి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీపీఎంతో పొత్తుపైనా సీపీఐ నేతలు ప్రస్తావించారు. ఖమ్మం జిల్లాలో ఓ సీటును సీపీఎంకు కేటాయించాలని సీపీఐ నేతలు సూచించగా, కాంగ్రెస్ అధిష్ఠానం దీనిపై సీపీఎంతో చర్చిస్తున్నారని రేవంత్ తెలిపారు.


అంతకు ముందు పొత్తుల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మునుగోడు టికెట్ సీపీఐకి కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. అయితే, మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఆయన ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఈ క్రమంలో అక్కడ స్నేహ పూర్వక పోటీ ఉంటుందని సీపీఐ తెలపగా, అలా వద్దని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచించారు. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు, మునుగోడు సీటు వదులుకోవడంపై నల్గొండ సీపీఐ నేతలు భగ్గుమంటున్నారు. కొత్తగూడెం కోసం మునుగోడును వదిలేశారనే విమర్శలు వస్తున్నాయి. 


సీపీఎం ఒంటరి పోటీ


మరోవైపు, ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసేందుకు సీపీఎం సిద్ధమైంది. భద్రాచలం, మధిర స్థానాలు వదులుకున్నా, మిర్యాలగూడ, వైరా స్థానాలపై డెడ్ లైన్ లోపు కాంగ్రెస్ స్పందించలేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్క స్థానంలోనూ గెలవకూడదనే లక్ష్యంతో ఈ ఎన్నికల్లో ముందుకు సాగుతున్నట్లు చెప్పిన ఆయన, వైరా విషయంలో భట్టి విక్రమార్క మాట మార్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్​ నేతల వైఖరి, తమను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులకు విలువ ఇవ్వని కాంగ్రెస్‌ తో పొత్తు ఉండదని తమ్మినేని స్పష్టం చేశారు. అనివార్య పరిస్థితుల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.


బీజేపీ ఓటమే లక్ష్యం


కేవలం బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్‌తో పొత్తు ప్రయత్నాలు చేసినట్లు ఆయన చెప్పారు. అయితే కాంగ్రెస్ నుంచి స్పష్టత లేదని, అందుకే పొత్తు నుంచి తప్పుకుని ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తమ్మినేని చెప్పారు. మొదటగా 17 స్థానాల్లో పోటీకి నిర్ణయం తీసుకున్నామని, ఈ సంఖ్య పెరుగే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, బలం ఉన్న చోట పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కమ్యూనిస్టుల్లేని శాసనసభ దేవుడు లేని దేవాలయం లాంటిదని వ్యాఖ్యానించారు.


సీపీఐకి మద్దతు


అసెంబ్లీలో కమ్యూనిస్టులకు ప్రాతినిథ్యం ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని తమ్మినేని అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా పోటీ చేయాలని నిర్ణయించినప్పటికీ సీపీఐ వైఖరి చెప్పలేదని, అయినప్పటికీ సీపీఐకి మద్దతిస్తామని తమ్మినేని పేర్కొన్నారు. ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగించి సీపీఐ పోటీ చేస్తే ఆ పార్టీకి మద్దతిస్తూ అక్కడ పోటీ చేయబోమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీపీఎం పోటీ చేసే స్థానాల్లో కాకుండా మిగతా చోట్ల బీజేపీని ఓడించే ప్రధాన పార్టీకి మద్దతివ్వాలని తమ కార్యకర్తలకు సూచిస్తామన్నారు. 


17 స్థానాల్లో పోటీ


తమకు బలం ఉన్న 17 నియోజకవర్గాల్లో సీపీఎం పోటీ చేయాలని నిర్ణయించింది. భద్రాచలం (ఎస్టీ), అశ్వారావుపేట (ఎస్టీ), పాలేరు, మధిర (ఎస్సీ), వైరా (ఎస్టీ), ఖమ్మం, సత్తుపల్లి (ఎస్సీ), మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్‌ (ఎస్సీ), భువనగిరి, హుజూర్‌నగర్, కోదాడ, జనగామ, ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు, ముషీరాబాద్‌ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తమ్మినేని వెల్లడించారు. త్వరలో పార్టీ జిల్లా కార్యదర్శులు, సీనియర్లతో చర్చించిన తర్వాత ఈ సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. ముషీరాబాద్‌ అభ్యర్థిగా సీపీఎం హైదరాబాద్‌ జిల్లా కార్యవర్గ సభ్యుడు మద్దెల దశరథ్‌ పేరు ప్రచారం జరుగుతోంది.


Also Read: తప్పుడు అఫిడవిట్ కేసులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సుప్రీంకోర్టు నోటీసులు