కొన్నేళ్లుగా ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో రెడ్ల ఆధిపత్యమే. కానీ ఈసారి మాత్రం బీసీలకు మూడు సీట్లు కేటాయించాలని, ఆ సామాజిక వర్గానికి చెందిన సీనియర్లు నేతలంతా గళమెత్తడానికి సిద్ధమవుతున్నారు. తమ ప్రతిపాదనను అధిష్టానం ముందు పెట్టేందుకు కూడా ప్రిపేర్ అవుతున్నారు.


ఇటీవల నల్గొండలో రేవంత్ హాజరైన నిరుద్యోగ సభలోనే బీసీల వాయిస్ వినిపించారు కొందరు నేతలు. బీసీలకు సీట్లు ఇవ్వాలని స్టేజ్ పైనే వీహెచ్ కామెంట్స్‌ చేయడం చాలా మందిని ఆకట్టుకుంది. బహిరంగ సభలో అందులోనూ రాష్ట్ర పార్టీ పెద్దలంతా ఉన్న సభలోనే ఆయన చేసిన కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు. దాన్ని మరింత దూకుడుగా అధిష్ఠానం వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 


Also Read: 100కుపై అసెంబ్లీ సీట్లు - కేసీఆర్ నమ్మకానికి కారణం ఓట్ల చీలికేనా ?


నల్గొండలో ఎస్సీ,ఎస్టీ రిజర్వుడ్ సెగ్మెంట్లు మినహాయిస్తే మిగిలినవి 9 అసెంబ్లీ స్థానాలు. ఇందులో కోదాడ, హుజూర్ నగర్ సెగ్మెంట్‌లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలోనే ఉన్నాయి. ఉత్తమ్ హుజూర్ నగర్‌పై కన్నేశారని టాక్ వినిపిస్తోంది. కోదాడ సీటును తన సతీమణి పద్మావతికి ఇప్పించాలని ఆయన పట్టబడుతున్నట్టు అనుచరులు చెప్పుకుంటున్నారు. నాగార్జున సాగర్,మిర్యాలగూడ సెగ్మెంట్‌లపై ఆల్రెడీ కుందూరు జానారెడ్డి కర్చీఫ్ వేసి కూర్చొని ఉన్నారు. సాగర్‌లో ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు జానారెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తనయుల్లో ఒకరికి మిర్యాలగూడ టికెట్ ఇప్పించాలని ప్రయత్నిస్తున్నారు. ఇది కుదరని పక్షంలో మిర్యాలగూడ టికెట్ బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ దక్కేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేగానీ వీరిద్దరినీ కాదని మరొకరికి టికెట్ వచ్చే ఛాన్స్  లేదన్నది పార్టీ వర్గాల విశ్లేషణ.


నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాదని మరొకరికి టికెట్ దక్కడం ఇంపాజిబుల్. సూర్యాపేటలో ఆర్.దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి మధ్య టికెట్‌ ఫైట్‌ నడుస్తోంది. ఇక భువనగిరిలో కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కాదని....మరొకరికి టికెట్ కేటాయించే ఛాన్స్ లేదు. మిగిలిన ఆలేరు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన స్టఫ్ ఉన్న లీడర్ లేకపోవడంతో బీసీ నేత బీర్ల ఐలయ్యకు టికెట్ దాదాపు ఖరారైనట్టే.


Also Read: బీఆర్ఎస్‌తో మేం రెడీ, కేసీఆరే తలుపులు మూసుకున్నారు - కూనంనేని


మునుగోడు నియోజకవర్గంలో మొన్నటి ఉపఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పాల్వాయి స్రవంతి బరిలోకి దింపిన విషయం తెలిసిందే. ఈసారి ఇదే సామాజిక వర్గానికి చెందిన చలమల్ల కృష్ణారెడ్డి కూడా టికెట్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇటు పీసీసీ చీఫ్ రేవంత్ చలమల్లను ఎంకరేజ్ చేస్తుండగా.... స్రవంతికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశీర్వాదం దండిగా ఉంది. బీసీ ఈక్వేషన్ లో పీసీసీ ప్రధాన కార్యదర్శి పున్న కైలాష్ కూడా మునుగోడులో తొడ గొట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు


అసెంబ్లీ స్థానాల్లో హైకమాండ్ హ్యాండిస్తే... పార్లమెంట్ స్థానాన్ని వదులుకోవద్దనే ప్లాన్‌తో కూడా ఉన్నారట బీసీ నేతలు. ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నకోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ స్థానాలపై గురి పెట్టారు. ప్రస్తుతం ఈ స్థానాలకు వేకెన్సీ ఉంది. గెలుపు గుర్రాల వేటలో సామాజిక ఈక్వేషన్స్ ను కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.