Congress has decided to field a strong candidate in  Cantonment : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉపఎన్నిక కూడా జరగనుంది.  ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదంలో చనిపోవడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమయింది. లోక్ సభతో పాటే ఉపఎన్నిక జరగనుంది. అయితే .. ఏకగ్రీవానికి సహకరించాలని లాస్య నందిత కుటుంబం కోరుతోంది. కానీ రాజకీయ పార్టీలన్నీ పోటీ చేయడానికే సిద్దమవుతున్నాయి. 


బీజేపీ నుంచి వచ్చిన నేతను అభ్యర్థిగా ఖరారు చేయనున్న కాంగ్రెస్                                     


ఈ స్థానంలో పోటీ చేయడానికి కాంగ్రెస్ సిద్ధమయింది. ఇందు కోసం అభ్యర్థిని రెడీ చేసుకుంది. గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన శ్రీగణేష్ అనే లీడర్ ని పార్టీలో చేర్చుకున్నారు. గద్దర్ కుమార్తెను గత ఎన్నికల్లో నిలబెట్టారు కానీ ఆమె మూడో స్థానంలో నిలిచారు.  ఈ సారి కూడా గద్దర కుమార్తెకు చాన్స్ ఇవ్వాలనుకున్నా.. బలమైన అభ్యర్థిని నిలబెట్టాలన్న ఉద్దేశంతో కంటోన్మెంట్ ప్రాంతంలో మంచి పరిచయాలు ఉన్న శ్రీగణేష్ అనే నేతను కాంగ్రెస్ ఆకర్షించింది. టిక్కెట్ హామీ ఇచ్చి ఆయనను పార్టీలో చేర్చుకన్నారు.  


అభ్యర్థిని నిలబెట్టకపోతే పార్లమెంట్ నియోజకవర్గంపై ప్రభావం                                 


మామూలుగా ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇస్తే.. పోటీని పెట్టవు రాజకీయ పార్టీలు. ఏకగ్రీవానికి సహకరిస్తాయి. కానీ ఈ సారి పార్లమెంట్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అభ్యర్థిని పెట్టకపోతే.. పార్లమెంట్ స్థానంపైనా ప్రభావం చూపుతుంది. అందుకే కాంగ్రెస్ పోటీ పెట్టాలని డిసైడయింది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈ సారి హోరాహోరీ పోరు ఉంటుందని.. ఓ నియోజకవర్గంలో గుర్తు లేకుండా చేసుకుంటే సమస్య వస్తుందని కాంగ్రెస్ వర్గాలు పోటీ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ కూడా పోటీ పోట్టాలనే నిర్ణయించుకుంది. శ్రీగణేష్ నే అభ్యర్థిగా పెట్టాలని అనుకున్నారు. కానీ పార్టీ మారిపోయారు.. దీంతో కొత్త అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సి ఉంది. 


బీఆర్ఎస్ తరపున లాస్య నందిత సోదరికి చాన్స్ ఇస్తారా ?                               


బీఆర్ఎస్ తరపున ఎవర్ని నిలబెడతారన్న దానిపై స్పష్టత లేదు. లాస్య నందిత సోదరి లాస్య నివేదిత తనకే సీటివ్వాలని కోరుతున్నారు. మీడియా ముందుకు వచ్చి విజ్ఞప్తి చేశారు. త్వరలో కేసీఆర్ ను కలుస్తానని చెప్పారు. అయితే  యువనేత  క్రిషాంక్ తనకు చాన్సివ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. బీఆర్ఎస్ చీఫ్ ఎవరికి చాన్సిస్తారో ఇంకా స్పష్టత రాలేదు. సాయన్న, లాస్యనందిత కుటుంబసభ్యులకే చాన్స్ ఇస్తే సానుభూతి పవనాలతో ఈజీగా  గెలవొచ్చని అంచనా వేస్తున్నారు.