CM Revanth said that Congress won 66 percent of Panchayats: 12702 గ్రామ పంచాయతీలలో 7527 కాంగ్రెస్, 808 మంది కాంగ్రెస్ రెబల్స్ నెగ్గారని సీఎం రేవంత్ ప్రకటించారు. 8335 గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్స్ గెలుచుకున్నారు. అంటే 66 శాతం కాంగ్రెస్ గెలుచుకుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కూటమిగా 33 శాతం, కమ్యూనిస్టులు 1 శాతం ఫలితాలు సాధించాయని.. ఇవి రెండేళ్ల ప్రజా పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు  అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎలాంటి లోటు పాట్లు లేకుండా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసిన అధికారులకు రేవంత్  అభినందనలు  తెలిపారు.  తన నివాసంలో మీడియా సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. 

Continues below advertisement

కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలని.. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల తరువాత గ్రామ పంచాయతీ ఎన్నికలు  జరిగాయన్నారు. ఎన్నికల్లో మాకు సంపూర్ణ మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు  తెలిపారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. 94 శాసనసభ నియోజవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికల జరిగితే 87 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ అత్యధిక ఫలితాలు సాధించిందని రేవంత్ సంతృప్తి వ్యక్తం చేశారు. బీఆరెస్ 6 నియోజవర్గాల్లో , బీజేపీ 1 నియోజకవర్గంలో అత్యధిక ఫలితాలు సాధించాయన్నారు.          

పేదలకు మేం అందించిన సన్నబియ్యం, ఉచిత కరెంటు, సజ్జ వడ్లకు బోనస్, 500 కే సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు, ఎస్సీ వర్గీకరణ అమలు, కులగణన ఇతర పథకాలతో ప్రజలు మమ్మల్ని ఆదరించారని తెలిపారు. ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారెంటీగా ప్రజలకు స్వేచ్ఛను అందించామని.. స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించామన్నారు. హోదాలను అడ్డుపెట్టుకుని ఎన్నికలను ప్రభావితం చేసేలా మేం నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. గెలిస్తే కళ్లు నెత్తికెక్కినట్లుగా మేం ఏనాడు వ్యవహరించలేదని గుర్తు చేశారు. 

ఈ ఫలితాలు మాపై మరింత బాధ్యతను పెంచాయన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యమని తెలిపారు. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా కొందరికి ఇంకా అహంకారం తగ్గలేదని బీఆర్ఎస్ ను ఉద్దేశించి రేవంత్ అన్నారు. ఒకాయన కడుపులో మూసీలో కాలుష్యం కంటే ఎక్కువ విషం కనిపిస్తోంది ..ఈ ఫలితాలుచూసే అద్భుతం అని కొందరు జబ్బలు చరుచుకుంటున్నారు..2029 లో కూడా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయి..2/3 మెజారిటీతో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. మీ కోపంతో అసూయతో ప్రజలకు మంచి జరగకుండా అడ్డుకోవద్దని సూచించారు.    కెసీఆర్  క్రియాశీల రాజకీయాల్లో ఉండగానే ఆయన్ను ఓడించి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చామని.. ఇప్పుడు ఆయన క్రియాశీల రాజకీయాల్లో లేరని రేవంత్ అన్నారు. కెసీఆర్ కు సూటిగా సవాల్ విసురుతున్నానని.. ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయాలని.. కృష్ణా జలాలపై ఎవరు అన్యాయం చేశారో చర్చకు సిద్ధమన్నారు. ఎప్పుడంటే అప్పుడు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామని.. గోదావరి, కృష్ణా జలాలపై సభలో చర్చకు సిద్ధంగా ఉన్నామని సీఎం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే పదేళ్లలో తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేసింది బీఆరెస్, కేసీఆర్ అని స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా జలాలపై వారు చేసిన ద్రోహం ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రజాస్వామ్య బద్ధంగా అసెంబ్లీలో చర్చ చేసి ముందుకు వెళతామని ప్రకటించారు.