CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా సంభవించిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించి ఆర్థిక సాయం కోరేందుకు ఆయన ఢిల్లీ వెళ్లినట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అమిత్ షాతో భేటీకి ఇప్పటికే అపాయింట్‌మెంట్ ఖరారు కాగా.. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఇంకా ఖరారు కాలేదు. గురువారం మధ్యాహ్నం అమిత్ షాతో, సాయంత్రం లేదా రాత్రి ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్లారు. పీసీసీ చీఫ్‌గా ఎంపికైన తర్వాత మహేశ్ కుమార్ తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. పార్టీ పెద్దలను పీసీసీ చీఫ్ మర్యాదపూర్వకంగా కలవనున్నారు. సీఎంతో మహేశ్ కుమార్ గౌడ్ తోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్  వెళ్లారు. 



ఈ క్రమంలోనే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపుల చట్టంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కోర్టులు ఇచ్చే తీర్పులు తమకే మేలు చేస్తాయని స్పష్టం చేశారు.  పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌ పదవి ప్రతిపక్షానికే ఇచ్చామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ చివరి రోజు బీఆర్ఎస్ సభ్యుల సంఖ్యను ప్రకటించారని.. 38 మంది అని ప్రకటించినప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. ‘2019 నుంచి అక్బరుద్దీన్‌ పీఏసీ ఛైర్మన్‌గా ఎలా ఉంటారు? కాంగ్రెస్‌ ప్రతిపక్షంగా ఉంటే ఎంఐఎంకు పీఏసీ ఛైర్మన్‌ పదవి ఎలా ఇచ్చారు? బతకడానికి వచ్చినోళ్ల ఓట్లు కావాలి కానీ, వాళ్లకు సీట్లు ఇవ్వొద్దా?బతకడానికి వచ్చినోళ్లు అంటూ కౌశిక్‌ చేసిన వ్యాఖ్యలు సరికాదు.  కౌశిక్ రెడ్డి మాటలపై కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పార్టీ ఫిరాయింపులపై చట్టం కఠినంగా ఉంటే మంచిదే. కోర్టు తీర్పులు మాకే మేలు చేస్తాయి’ అని అన్నారు.



కేంద్రంతో చర్చ
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్రంతో చర్చించనున్నారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల సంభవించిన భారీ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇవాళ అమిత్ షాను కలిసి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దాదాపు రూ.5,438 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్ రెడ్డి తొలుత కేంద్రానికి నివేదించారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. గ్రామీణ, మండల, జిల్లా స్థాయి రోడ్లు పెద్దఎత్తున ధ్వంసం అయ్యాయని  వివరిస్తారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరనున్నారు. జాతీయ విపత్తుగా ప్రకటించి ఆర్థిక సాయం అందించాలని రేవంత్ కోరారు. ప్రధాని, ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ ఖరారైతే.. వర్షాల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి వారికి అందచేయనున్నారు. ఇదే పర్యటనలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోనూ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. వీలైతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలను కలుస్తానన్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై పార్టీ నేతల ఆమోదం తీసుకునే అవకాశం ఉంది.  ఈ రోజు క్లారిటీ రాకపోతే.. రేపు కూడా ఢిల్లీలోనే ఉండి ఆరు పేర్లను ఫైనల్‌ చేయనున్నారు. నామినేటెడ్, ఎమ్మెల్సీ స్థానాల భర్తీ, పీసీసీ చీఫ్ నియామకం పూర్తవ్వడంతో ప్రస్తుతం అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపైనే పడింది.