CM Revanth Reddy Released Telangana Darshini GO: తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఇకపై ఉచితంగా పర్యాటక, చారిత్రక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈ మేరకు 'తెలంగాణ దర్శిని'కి (Telangana Darshini) సంబంధించిన జీవోను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుక్రవారం విడుదల చేశారు. చారిత్రక, పర్యాటక ప్రాంతాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం రూపొందించినట్లు చెప్పారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని సీఎం కోరారు. రాష్ట్రంలో సంక్షేమం సహా పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని అన్నారు. మూసీ పరీవాహకంలోని చారిత్రక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దనున్నామని.. మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని సీఎం స్పష్టం చేశారు.






'ఉస్మానియాను గోషామహల్‌కు తరలిస్తాం'


ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ తరలించి ప్రస్తుత భవనాన్ని పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే నగరంలో చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయని అన్నారు. 'పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తాం. త్వరలోనే అందులో శాసన మండలి ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం శాసన మండలి కొనసాగుతున్న జూబ్లీహాల్ పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ హాల్‌ను సీఐఐ దత్తత తీసుకుని పరిరక్షించాలి. హైకోర్టు భవనం, సిటీ కాలేజ్ భవనం, పురానాపూల్ బ్రిడ్జి వంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చార్మినార్ పరిరక్షణ ప్రాజెక్ట్ కొనసాగుతోంది.' అని సీఎం పేర్కొన్నారు.


Also Read: Draupadi Murmu : ఈ నెల 28న హైదరాబాద్‌కు రాష్ట్రపతి రాక - ఆ రూట్‌లో ఐదు గంటలపాటు అస్సలు వెళ్లకండి!