CM Revanth Reddy Started Katamayya Rakha Kits Scheme: కుల వృత్తులకు చేయూత అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ (Abdullapurmet) మండలం లష్కర్‌గూడలో గీత కార్మికులకు 'కాటమయ్య రక్ష కిట్ల' (Katamayya Raksha Kits) పంపిణీ పథకాన్ని  ఆదివారం ప్రారంభించారు. ఆధునిక టెక్నాలజీతో తయారు చేసిన సేఫ్టీ కిట్లను లబ్ధిదారులకు అందజేశారు. గీత కార్మికులు చెట్లు ఎక్కుతుండగా ప్రమాదాల బారిన పడకుండా ఈ కిట్లు ఉపయోగపడనున్నాయి. హైదరాబాద్ ఐఐటీ వీటిన తయారు చేయగా బీసీ కార్పొరేషన్ ద్వారా వీటిని అందించారు. కిట్ల పనితీరును బుర్రా వెంకటేశం సీఎంకు వివరించారు. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. అనంతరం గౌడన్నలతో సీఎం, మంత్రులు సహపంక్తి భోజనం చేశారు.


ఈ సందర్భంగా గీత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్న సీఎం రేవంత్.. లష్కర్ గూడ తాటివనంలో ఈత మొక్క నాటారు. తాటి వనాల పెంపును ప్రోత్సహించాలని సీఎంను గీత కార్మికులు కోరారు. ఇందు కోసం గ్రామంలో 5 ఎకరాలు కేటాయించాలని అన్నారు. అలాగే, తాటి వనాలకు వెళ్లేందుకు మోపెడ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా, వన మహోత్సవంలో భాగంగా తాటి చెట్ల పెంపకాన్ని పరిశీలిస్తామని సీఎం తెలిపారు. రియల్ ఎస్టేట్ పెరగడం వల్ల తాటి వనాలు తగ్గుతున్నాయని.. రోడ్ల పక్కన వీటిని నాటాలనే నిబంధన విధిస్తామని చెప్పారు.


'కులవృత్తులను కాపాడతాం'


గౌడన్నల కులవృత్తులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ తెలిపారు. 'కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే బలహీనవర్గాల గౌరవం పెరుగుతుందని గౌడన్నలు ఎంతో ప్రచారం చేశారు. పౌరుషానికి, పోరాటానికి మారుపేరు గౌడన్నలు. బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి చేస్తోంది. ప్రభుత్వ భూముల్లో తాటి, ఈత చెట్లు పెంచేలా చర్యలు చేపట్టేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చెరువు గట్లపై కూడా చెట్లు నాటేలా ఇరిగేషన్ విభాగం చర్యలు చేపట్టాలి. కుల వృత్తులపై ఆధారపడిన సోదరులు వారి పిల్లలను ఉన్నత చదువులు చదివించాలి. వాళ్లను ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దాలి. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారు భాగస్వాములు కావాలి. బలహీన వర్గాలు పాలకులుగా మారాలంటే  ఏకైక మార్గం చదువు మాత్రమే.' అని సీఎం పేర్కొన్నారు.


'త్వరలోనే హయత్‌నగర్‌కు మెట్రో'


త్వరలోనే హయత్‌నగర్‌కు మెట్రో రాబోతుందని.. దీనికి సంబంధించి అన్ని ప్రణాళికలు పూర్తయ్యాయని సీఎం రేవంత్ చెప్పారు. ఫార్మా కంపెనీల కోసం సేకరించిన భూమిలో వివిధ యూనివర్సిటీలు, మెడికల్ టూరిజం, పరిశ్రమల  ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. న్యూయార్క్ నగరంతో పోటీ పడేలా మహేశ్వరంలో ఒక అద్భుతమైన నగరం నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ఊటీ కంటే అద్భుతమైన రాచకొండ ప్రాంతాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి అణువుగా మార్చబోతున్నామని.. రంగారెడ్డి జిల్లాకు మహర్దశ రాబోతోందని అన్నారు. ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా రంగారెడ్డి జిల్లాను తీర్చిదిద్దుతామని వెల్లడించారు.


'పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారి'


కాంగ్రెస్ పని అయిపోయింది అన్నవాళ్లు.. ఇప్పుడు వాళ్ల వైపు ఎంతమంది ఉన్నారని లెక్కపెట్టుకునే పరిస్థితి ఏర్పడిందని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఔటర్ రింగ్ రోడ్, ఫార్మా ఇండస్ట్రీ, అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ తెచ్చింది కాంగ్రెస్ కాదా.? అని ప్రశ్నించారు.  'తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌కు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారు. మీరు ప్రభుత్వాన్ని పడగొడతామంటే.. ప్రభుత్వాన్ని నిలబెట్టాలని వాళ్లు మద్దతుగా వస్తున్నారు. పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. గత బీఆర్ఎస్ పాలకులు తెలంగాణను అప్పులకుప్పగా మార్చారు. మేం ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతున్నాం.' అని సీఎం పేర్కొన్నారు.


Also Read: Telangana RTC: అరుణాచలంకు టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు, ఈ జిల్లాల నుంచి నేరుగా