బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరుగుతున్న జనరల్ బాడీ సమావేశంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేల పనితీరు గురించి కూడా మాట్లాడారు. ఈ సభలో సర్వేల విషయాన్ని ప్రస్తావించారు. కొంత మంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ వార్నింగ్ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పని చేయాలని, సరిగ్గా పని చేసి మళ్లీ గెలవాలని సూచించారు. పని తీరు బాగా లేని వారి జాబితా తన వద్ద ఉందని, వారు ప్రవర్తన మార్చుకోవాలని చెప్పారు. లేదంటే వారి తోకలు కత్తిరిస్తానని తేల్చి చెప్పారు. అయితే, ఈ ఏడాది షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలకు వెళ్తారని కేసీఆర్ ఈ సభలో స్పష్టం చేశారు. బాగా పనిచేసిన వారికే ఈసారి టికెట్లు దక్కుతాయని తేల్చి చెప్పారు.


ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పలు తీర్మానాలను చర్చించి ఆమోదించుకున్నారు. ‘ప్రతి రాష్ట్రంలో భారీ సాగు నీటి ప్రాజెక్టు నిర్మాణం, దేశ వ్యాప్తంగా 24 గంటల విద్యుత్‌ సరఫరా, విదేశాలకు దేశీయ ఆహారోత్పత్తుల ఎగుమతి, దేశ వ్యాప్తంగా దళిత బంధు అమలు. దేశంలో బీసీ జనగణన జరపడం లాంటి వివిధ తీర్మానాలను ఆమోదించుకున్నారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం ప్రణాళికలు చేపట్టాలని సభ నిర్ణయించింది.


ముందుగా పార్టీ సెక్రటరీ జనరల్ ఎంపీ కే. కేశవరావు ప్రసంగంతో ప్రతినిధుల సభ ప్రారంభం అయింది. అనంతరం బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ప్రసంగం కొనసాగింది. అనంతరం  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తీర్మానాలను ప్రవేశ పెట్టారు. అనంతరం లంచ్ బ్రేక్ ఇచ్చారు.


టీఆర్ఎస్ పార్టీగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిజం చేస్తూ ఎదిగిన పార్టీ నేడు దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే దిశగా బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఎదిగిన క్రమాన్ని వివరించారు. భవిష్యత్‌ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్‌ దిశానిర్ధేశం చేశారు. భవిష్యత్‌ కార్యాచరణపై పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.


బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రసంగం – ముఖ్యాంశాలు: 


• రాజకీయ పంథాలో తక్కువ నష్టాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం
• పార్లమెంటరీ పంథాలో ఏదైనా సాధించవచ్చని స్వరాష్ట్ర సాధనతో దేశానికి తెలియజేయగలిగినం. 
• అదే పంథాలో అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నాం. 
• అకాలవర్షాలు రాకముందే పంట కోతలు పూర్తయ్యేలా వ్యవసాయశాఖ రైతులను చైతన్యం చేయాలి. 
• మక్కలు, జొన్నలు అన్ని పంటలు కూడా గతంలో మాదిరి కొంటాం. మార్క్ ఫెడ్ కు ఈ మేరకు ఆదేశాలిస్తం. 
• వ్యవసాయాన్ని నిలబెట్టి, రైతుల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తున్నది. 
• దేశ జీఎస్డీపిలో వ్యవసాయ రంగం వాటా 23 శాతం 
• కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉన్నాయి. వాటి సర్వే నెంబర్లేసి నా ఆఫీసులో ఇవ్వండి. ఇండ్లు కట్టుకోవటానికి యోగ్యంగా వుంటే వాటిని తక్షణం పంచేద్దాం. 
• మన శాసనసభ్యులు లేని చోట జడ్పీ ఛైర్మన్లు, ఎంపీలు, జిల్లా ఇంచార్జిలుగా ఉపయోగించుకోవాలి. ఈ 3, 4 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలి. 
•  మన మంత్రులు పారదర్శకంగా  పనిచేస్తుండటంతో రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నయి.
• ఏపీ తలసరి ఆదాయం రూ. 2,19,518. ఇది మనకన్నా లక్ష రూపాయలు తక్కువ. ఇంతకన్నా తక్కువ రాష్ట్రాలు 16, 17 వున్నాయి. 
• తెలివి ఉంటే బండమీద నూకలు పుట్టించుకోవచ్చు. 


కొత్త సెక్రెటేరియట్ వివరాలు
• కొత్త సెక్రటేరియట్ ప్రారంభం సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు 12.45 గంటల కల్లా అక్కడికి చేరుకోండి. 
• మధ్యాహ్నం 1.58 నుంచి 2.04 గంటల వరకు మంత్రులు వారి వారి ఛాంబర్స్ కు పోవాలి.
• సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోర్ లోబ్రీఫ్ మీటింగ్, లంచ్, తర్వాత డిస్పోస్
• మెయిన్ గేట్ గుండా సీఎం, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలకు ఉద్దేశించింది. 
• 3 గేట్లు, నార్త్ ఇస్ట్ గేట్ అధికారుల రాకపోకలకు ఉద్దేశించింది, సౌత్ ఇస్ట్ జనరల్ విసిటర్స్ కు ఉద్దేశించింది


అధికారంలోకి రావడం పెద్ద టాస్క్ కాదు - కేసీఆర్


• తెలంగాణ రాష్ట్ర ప్రగతిని చూసేందుకు మహారాష్ట్ర వాళ్లు సొంత బండ్లేసుకుని వచ్చి చూసిపోతున్నారు.
• క్యాడర్ లో అసంతృప్త్తిని తగ్గించే చర్యలు చేపట్టండి.
• ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, ప్రజలతో కమ్యూనికేషన్స్ పెంచుకోవడం, నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణను చేపట్టాలి.
• మన ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది పెద్ద  టాస్క్ కాదు. మునుపటి కన్నా ఎక్కువ సీట్లు రావాలి అనేది ప్రాధాన్యతాంశం.
• దూపయినప్పుడు బావి తవ్వుతం అనే రాజకీయం నేడు కాలానికి సరిపోదు.
• బీఆర్ఎస్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడానికి టీవీ యాడ్స్, ఫిల్మ్ ప్రొడక్షన్ కూడా మన పార్టీ నుండి భవిష్యత్తులో చేపట్టవచ్చు.
• అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానల్ ను కూడా నడపవచ్చు.