రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూముల పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించి లబ్ధిదారులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేశారు. మహిళల పేరు మీదనే పట్టాలు పంపిణీ చేస్తున్నట్లుగా సీఎం తెలిపారు. అంతేకాక, వారికి రైతు బంధ నిధులను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పోడు భూముల రైతులపై గతంలో నమోదైన కేసులను ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.


అతి తక్కువ కాలంలోనే తెలంగాణలో మంచి ప్రగతి సాధించామని చెప్పారు. తెలంగాణలో అన్ని వర్గాల వారికి 24 గంటల కరెంటు వస్తుందని, ఈ ఘనత విద్యుత్ శాఖలోని ప్రతి ఒక్కరికి దక్కుతుందని అన్నారు. 


మధ్యాహ్నం రెండు గంటలకు ఆసిఫాబాద్‌కు చేరుకున్న ఆయన ముందుగా బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కుమ్రంభీం చౌరస్తాలో కుమ్రంభీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కొత్తగా నిర్మించిన జిల్లా పోలీస్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత కలెక్టరేట్‌లో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాన్ని సీఎం ప్రారంభించారు. అక్కడ పురోహితులు సీఎం కేసీఆర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్.. కలెక్టర్‌ను ఆయన కార్యాలయంలో సీట్లో కూర్చోబెట్టారు. కలెక్టర్ కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు చెప్పారు. ఆ తర్వాత కలెక్టర్‌.. సీఎం కేసీఆర్‌కు శాలువా కప్పి సన్మానించారు.