ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ప్రత్యక్ష పోరుకు సిద్ధం అయ్యారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఓ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకిస్తున్నారు. దానికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా విపక్షాల మద్దతును కూడగడుతున్నారు. ఇందుకోసం కేజ్రీవాల్ సీఎం కేసీఆర్‌ను కూడా కలవనున్నారు. అందుకోసం కేజ్రీవాల్ శనివారం (మే 26) హైదరాబాద్‌కు రాబోతున్నారు. పార్లమెంట్‌లో ఈ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించాలని కోరనున్నారు. ఈ విషయంలో కేజ్రీవాల్‌ ఇప్పటికే బంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేలను కలిసి కూడా చర్చించారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌తో కూడా రేపు సమావేశం కానున్నారు.


ఆర్డినెన్స్ ఏంటంటే


ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల ట్రాన్స్‌ఫర్, పోస్టింగ్‌లపై కేంద్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఢిల్లీలో సర్వాధికారాలు మళ్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఢిల్లీలో పాలనాధికారాలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే ఉంటుందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసి సంగతిని కేజ్రీవాల్‌ గుర్తు చేస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన 8 రోజులకు కేంద్రం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి లెఫ్టినెంట్ గవర్నర్ కి అధికారం కట్టబెట్టిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. దీనిపై మరోసారి న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.


ఇటీవల సుప్రీం కోర్టు బ్యూరోక్రాట్‌ బదిలీల నియామకాలపై తీర్పు ఇచ్చింది. ఈ విషయంలో కేంద్రం పాత్ర కాదు, ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వమే ఆ అంశంలో నియంత్రణ కలిగి ఉంటుందని ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఈ తీర్పును పూర్వపక్షం చేసేలా ఆర్డినెన్స్‌ని కేంద్ర ‍ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ శీతకాల సమావేశంలో ఆమోదించిన ఆర్డినెన్స్‌ స్థానంలో బిల్లును తీసుకురావాలని యోచిస్తోంది.


కేజ్రీవాల్‌కు ఇప్పటికే బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్‌ ఠాక్రే మద్దతు పలికారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని , రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోందని వారు ఆరోపించారు.