CM KCR: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కాస్తంత తగ్గుముఖం పట్టాయి. కొన్ని జిల్లాల్లో మాత్రం మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే వర్షాలు తగ్గడంతో.. వరదలు తగ్గుముఖం పట్టి బురద మయమైన ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాల పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో రోజు క్షేత్రస్థాయి పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో సాగుతున్న సహాయక, పునరావాస చర్యలపై మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మాట్లాడి, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. వరద ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బురదమయం అయిన ప్రాంతాల్లో అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయసహకారాలు అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. వరదల నేపథ్యంలో ప్రజారోగ్యం, శ్రేయస్సును కాపాడటానికి తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పారు. 






ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు వరద తాకిడి, ముంపునకు గురైన ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి హెచ్చరికలు చేస్తూ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహార పొట్లాలు, తాగు నీరు, మందులను హెలికాప్టర్‌ ద్వారా అందించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మూడో రోజు గోదావరి ముంపునకు గురైన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. భారీ వర్షాలతో చెరువులు తెగడం, రహదారులు, బ్రిడ్జ్ లు కోతకు గురికావడంతో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. ఖమ్మం జిల్లా మున్నేరు వాగు తగ్గు ముఖం పట్టే వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 


ములుగు జిల్లాలో భారీ వర్షాలు, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష చేపట్టారు. వరద ఉద్ధృతి తగ్గి పరిస్థితులు కుదుటపడుతున్న జీహెచ్ఎంసీ పరిధిలో సహాయక కార్యక్రమాలను కొనసాగించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తగ్గి పరిస్థితులు కుదుటపడుతున్నందున, పలువురు మంత్రులు ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యలతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా పటిష్ట కార్యాచరణను అనుసరించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయ, పునరావాస చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టినందున, వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.