CM KCR Tour in Flood Affected Areas: ముఖ్యమంత్రి కేసీఆర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇందుకోసం సీఎం హన్మకొండ నుంచి కాసేపటి క్రితం ఏటూరు నాగారం బయల్దేరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయాల్సి ఉన్నా, వాతావరణం అనుకూలించలేదు. దీంతో కేసీఆర్ రోడ్డు మార్గంలో ఏటూరునాగారం వెళ్తున్నారు. సీఎం వెంట మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు ఉన్నారు.


రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో చోటు చేసుకున్న ప్రకృత్తి విపత్తు వల్ల చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా గోదావరి పరీవాహక ప్రాంతంలో పోటెత్తిన వరదల కారణంగా చాలా గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం ఉదయం ఏరియల్ సర్వే చేపట్టాలని నిర్ణయించారు. ఈ సర్వేకడెం నుంచి భద్రాచలం వరకు ఉన్న గోదావరి పరీవాహక ప్రాంతంలో కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ సర్వేలో సీఎం కేసీఆర్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొననున్నారు. 


తొలుత పర్యటన ఇలా ఖరారు


ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ చేపట్టే ఏరియల్ సర్వేకు సంబంధించిన హెలికాప్టర్ రూటు సహా తదితర విధి, విధానాలను అధికార యంత్రాంగం పర్యవేక్షించి రూట్ ను ఫైనల్ చేయనుంది. అలాగే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి హరీష్ రావు వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. గోదావరి వరద ముంపు ప్రాంతాల్లోని దవాఖానాలకు చెందిన వైద్యులు, ఉన్నత అధికారులతో ఈ సమీక్షా సమాశేవం సాగుతుంది. అయితే రేపటి సీఎం పర్యటనలో భాగంగా ఇందుకు సంబంధించిన కార్యాచరణ పై వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది.


అంతే కాకుండా వరద ప్రభావం తగ్గేవరకు వరద బాధితులకు సాయంగా ఉండాలని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. క్షేత్ర స్థాయిల్లో తిరుగుతూనే.. ప్రజల సమస్యలను పరిష్కరించాలని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెరాస నేతలు, ప్రభుత్వ అధికారులు ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ... ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు. రాష్ట్రంలో వానలు, వరదల కారణంగా నాలుగు రోజుల పాటు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లోనే ఉండి పరిస్థితులను పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తూ... రాష్ట్రంలో ప్రాణ నష్టం జరగకుండా చేశారు. ఇందులో ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ అధికారులను కూడా భాగం చేశారు.


పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడాల్సిన అంశాలపై దిశానిర్దేశం..


ఈరోజు మధ్యాహ్నం తెరాస ఎంపీలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈనెల 18 నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల దృష్ట్యా... ఒంటిగంటకు ప్రగతి భవన్ లో ఎంపీలతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఉభయసభల్లో తెరాస నేత అనుసరించాల్సిన విధి విధానాలపై దిశానిర్దేశం చేసేందుకు ఆ పార్టీ పార్లమెట్ సభ్యులతో సీఎం సమావేశం అవుతారు. లోక్ సభ, రాజ్య సభల్లో తెరాస ఎంపీలు అనుసరించాల్సిన పలు కీలక అంశాలపై సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు. 


కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపీలకు సూచించారు. తెలంగాణపై వివక్షను ఎత్తి చూపేలా.. పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని, ధాన్యం కొనుగోళ్లపైనా పోరాడని సూచించారు. ఇందుకు సంబంధించి నేతలతో ఇప్పటికే పోన్ లో మాట్లాడారు. మమతా బెనర్జీ, అర్వింద్ కేర్జీవాల్, తేజస్వీ యాదవ్, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్ లతో పలు అంశాలపై చర్చించారు. పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై పోరాడదామని సీఎం కేసీఆర్ తెలిపారు.