Tummala Nageswara Rao: మరో మూడు నెలల్లో ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పార్టీలు మారడాలు జోరందుకున్నాయి. వచ్చే ఎన్నికలు కాంగ్రెస్‌కు చావో రేవో అవడంతో అధికారం దక్కించుకోవడం కోసం ఆ పార్టీ అందిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగానే ఇతర పార్టీల్లోని అసంతృప్తి నేతలను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. అధికార పార్టీ నేతలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అందుకు ఇటీవల బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో అసంతృప్తి నేతలతో టచ్‌లోకి వెళ్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరితే మంచి భవిష్యత్ ఉంటుందని భరోసా కల్పిస్తోంది.


ఇటీవల ప్రకటించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో తుమ్మల నాగేశ్వరరావు పేరు లేదు. ఖమ్మం, పాలేరు ఈ రెండింటిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయన సీటు ఆశించారు. అయితే తుది జాబితాలో తుమ్మల పేరు లేదు. దీంతో అసంతృప్తితో ఉన్న తుమ్మలను కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ ఆ పార్టీ నేతలు కోరారు. ఇందులో భాగంగానే ఆదివారం సీఎస్పీ నేత బట్టి విక్రమార్క మాజీ మంత్రి తుమ్మలతో భేనటీ అయ్యారు. దమ్మపేట మండలం గంగుడుపల్లి గ్రామంలో తుమ్మల ఇంటికి వెళ్లిన బట్టి ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజకీయాలపు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం బట్టిని తుమ్మల శాలువాతో సన్మానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని తుమ్మలను బట్టి విక్రమార్క ఆహ్వానించారు.


శనివారం తుమ్మలను కలిసిన పొంగులేటి
కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి శనివారం ఉదయం ఖమ్మంలోని తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి వెళ్లారు. అయితే ఈ ఇద్దరు నేతలు బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పటికీ బహిరంగంగా పలకరించుకున్న దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు మారిన సమీకరణాల నేపథ్యంలో పొంగులేటి తుమ్మల నివాసానికి వెళ్లారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా పొంగులేటి తుమ్మలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.


భేటీ అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. తుమ్మల నాగేశ్వరరావు సీనియర్‌ నాయకుడని, అపార రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అన్నారు. ప్రజల కోసమే చిత్తశుద్ధితో పని చేశారరని అన్నారు. బీఆర్‌ఎస్‌లో తమను అవమానించి పొగబెట్టారని అన్నారు. తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఆయన మిత్ర బృందాన్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనకు చిరకాల మిత్రుడని అన్నారు. 


కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా పొంగులేటి తనను ఆహ్వానించారని తెలిపారు. సీతారామ ప్రాజెక్టులోకి గోదావరి జలాలు విడుదలయ్యేలా చూడడమే తన లక్ష్యమన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని.. అందరి అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత తదుపరి నిర్ణయాలను ప్రకటిస్తామన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని స్వయంగా ఆహ్వానించారు.


తుమ్మలతో పెరగనున్న కాంగ్రెస్ బలం
కాంగ్రెస్ పార్టీలో తుమ్మల చేరిక దాదాపు ఖరారు అయిందని, వారంలోపే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అనుచరులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో తుమ్మల అనుచరులు సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చారని, అనుచరులు సైతం తుమ్మలను కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీలో చేరితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలం పుంజుకోవడం ఖాయమని, బీఆర్ఎస్‌కు ధీటైన జవాబివ్వడంతో పాటు.. క్లీన్ స్వీప్ చేయగలమనే భావన వ్యక్తం చేస్తున్నారు. తుమ్మల, పొంగులేటితో పాటు మరో బీఆర్ఎస్ నాయకుడు జలగం వెంకట్రావు సైతం కాంగ్రెస్ గూటికి చేరితే తిరుగుండదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.