టాలీవుడ్ లో మిగతా హీరోలతో పోల్చితే మాస్ మహారాజ రవితేజ కాస్త డిఫరెంట్. మిగతా హీరోలు కాస్త సమయం దొరికినా, వెకేషన్లు, పార్టీలు అంటూ ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో షికార్లు చేస్తుంటారు. కానీ, రవితేజ పని, పని, పని అంతే. ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా ఒకదాని తర్వాత మరొక సినిమా చేస్తూనే ఉంటాడు. ఏడాదికి కనీసం రెండు, మూడు సినిమాలు చేసే కొద్ది మంది హీరోల్లో ఆయన ఒకరు. గత ఏడాది డిసెంబర్ లో ‘ధమాకా’తో దుమ్మురేపిన రవితేజ, ఈ సంక్రాంతి సీజన్ లో ‘వాల్తేరు వీరయ్య’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ‘రావణాసుర’ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ‘టైగర్ నాగేశ్వర్ రావు’తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. భారీగా అంచనాలు నెలకొన్న ఈ సినిమా అక్టోబర్ 20న విడుదలకు రెడీ అవుతోంది. తాజాగా మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు.


ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రవితేజ


ఇప్పటికే ‘టైగర్ నాగేశ్వర్ రావు’ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన నేపథ్యంలో త్వరలో కొత్త సినిమాలు సెట్స్ మీదకు రానున్నాయి. ఈ గ్యాప్ లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాడు రవితేజ. ప్రస్తుతం కుటుంబంతో కలిసి జపాన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో వెకేషన్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. ఇందులో టోక్యో వీధుల్లో ఫ్యామిలీతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. రవితేజ్, అతడి భార్య, కొడుకు, కూతురుతో పాటు మరికొంత మంది బంధువులు ఈ ఫోటోల్లో ఉన్నారు. నిజానికి రవితేజ తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడు. తాజాగా వెకేష్ ఫోటోలు షేర్ చేయడం పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వెకేషన్ పోస్టులకు విపరీతంగా లైక్స్ కొడుతున్నారు. తన కుటుంబంతో కలిసి కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.  






వరుస సినిమాలతో ఫుల్ బిజీ


ఇక రవితేజ తదుపరి సినిమాల గురించి చూస్తే, 'టైగర్ నాగేశ్వర్ రావు' తర్వాత కార్తీక్ ఘట్టమనేనితో కలిసి 'ఈగిల్' అనే సినిమా చేయబోతున్నాడు రవితేజ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ ను కూడా ప్రకటించాడు. వీరిద్దరూ ఇంతకు ముందు 'డాన్ శీను', 'బలుపు', 'క్రాక్' లాంటి హిట్ సినిమాల్లో కలిసి పని చేశారు. ఈ నేపథ్యంలోనే కొత్త సినిమాపై  భారీ అంచనాలు ఉన్నాయి. అటు త్వరలో 'కలర్ ఫోటో' దర్శకుడు సందీప్ రాజ్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.   


ఇక రవితేజ తాజా చిత్రం 'టైగర్ నాగేశ్వర్ రావు'  టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.  కృతి సనన్ సోదరి నూపుర్ సనన్ ఈ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. మరో యంగ్ బ్యూటీ గాయత్రి భరద్వాజ్ కూడా ఇందులో నటిస్తోంది. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.  


Read Also: ‘జవాన్‘ దర్శకుడితో చేతులు కలపనున్న ‘పుష్ప‘- త్వరలో పాన్ ఇండియన్ మూవీ షురూ!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial