Flood Damage Assess: తెలంగాణలో వరదల నేపథ్యంలో నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రానికి రానుంది. వరద పరిస్థితిపై అంచనా వేసేందుకు గాను హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్ర బృందాన్ని నియమించారు. 8 శాఖల అధికారులతో కూడిన సెంట్రల్ టీమ్ తెలంగాణ రాష్ట్రానికి రానుంది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఈ నెల 31వ తేదీ నుంచి తెలంగాణలో పర్యటించనుంది. 8 శాఖల అధికారులతో కూడిన ఈ కేంద్ర బృందం రాష్ట్రానికి రానుంది. క్షేత్రస్థాయిలో నష్టాలను కేంద్ర బృందం అంచనా వేసిన తర్వాత తెలంగాణ సర్కారు వివరణాత్మక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. అనంతరం అవసరం మేరకు సెంట్రల్ టీమ్ మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికను కేంద్ర హోంశాఖకు అందజేస్తుంది. 


కేంద్ర బృందంలో వ్యవసాయ, ఆర్థిక, రహదారులు, జలశక్తి, విద్యుత్, అంతరిక్ష విభాగంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కు చెందిన అధికారులు ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో 2019-20, 2020-21, 2021-22, 2022-23 సంవత్సరాల్లో సంబంధిత మంత్రిత్వ శాఖలు అమలు చేసిన వివిధ పథకాలు, కార్యక్రమాల కింద చేసిన కేటాయింపులు, నిధుల విడుదల, ఖర్చుల వివరాలను కూడా కేంద్ర బృందానికి ఇవ్వాలని సంబంధిత శాఖలను కేంద్ర హోంశాఖ ఆదేశించింది.


రాష్ట్రంలో ఈరోజు, రేపు వర్షాలు


ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడాక్కడా  ఎల్లుండి చాలా చోట్ల, కురిసే అవకాశం ఉంది. వాతావరణ హెచ్చరికల్లాంటివి ఏమీ జారీ చేయలేదు. ఆగస్టు 1న మాత్రం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిరర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా్లలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 27.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.2 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ 82 శాతంగా నమోదైంది.


గంగా పశ్చిమ బెంగాల్, దానికి ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర ఒడిశా, దానిని ఆనుకొని ఉన్న దక్షిణ పశ్చిమ బంగాల్ తీరంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ. వరకూ విస్తరించి ఉంది. నిన్న 18°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుండి 5.8 కిమీ ఎత్తు వద్ద  ఉన్న షీయర్ జోన్ ఈ రోజు బలహీన పడింది. ఈ రోజు  దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.