CAPF Exam in Regional Languages: సాయుధ బలగాల్లో పనిచేయాలనుకునే యువతకు శుభవార్త చెప్పింది కేంద్రం. ఇకనుంచి ప్రాంతీయ భాషల్లో ఉద్యోగ పరీక్షలు నిర్వహించాలన్న బీఆర్ఎస్ డిమాండ్ కు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఇప్పటివరకూ కేవలం హిందీ, ఇంగ్లీష్ లోనే నిర్వహించే ఈ పరీక్షలను ఇక నుంచి ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు మరో 13 ప్రాంతీయ భాషల్లో కేంద్ర సాయుధ బలగాల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CAPF) లాంటి పరీక్షలను తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. 2024 జనవరి 1 తేదీ నుంచి ఈ విధానం కానుంది.


సీఎం కేసీఆర్ సూచనతో కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ


కేంద్ర CRPF ప్రభుత్వ ఉద్యోగాల కోసం కేవలం హిందీ, ఇంగ్లీష్ మాధ్యమంలో మాత్రమే పోటీ పరీక్షల నిర్వహిస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు మంత్రి KTR విజ్ఞప్తి చేశారు. తాజాగా విడుదల చేసిన CRPF జాతీయ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌లో కేవలం హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో మాత్రమే పరీక్ష ఉంటుందని స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖలో సూచించారు. CRPF ఉద్యోగ సిబ్బంది నియామకం కోసం చేపడుతున్న ఈ పరీక్షను, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు గుర్తించబడిన అన్ని అధికారిక భాషల్లో నిర్వహించాలని కేంద్రాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు.


ఇంగ్లీష్ మీడియంలో చదవనివారు, హిందీ ప్రాంతాలకు చెందని నిరుద్యోగ యువకులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని లేఖలో తెలిపారు. ఇప్పటికే వివిధ ఉద్యోగాల కోసం అనేక పరీక్షలు నిర్వహించే బదులు, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా కామన్ ఎలిజిబిటీ టెస్ట్ విధానంలో 12 అధికారిక భాషల్లో పరీక్ష నిర్వహించాలని కేంద్రప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకున్నా అమలు కావడం లేదని కేటీఆర్ లేఖలో గుర్తు చేశారు. అధికారిక భాషలు కలిగిన భారతదేశంలో, కేవలం హిందీ వారికి మాత్రమే మాతృభాషలో పోటీపరీక్షలు రాసే అవకాశం ఇవ్వడమంటే, దేశ రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని కేటీఆర్ లేఖలో అభిప్రాయపడ్డారు. 


సమాన అవకాశాలు పొందేలా ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని CRPF నోటిఫికేషన్ కాలరాస్తోందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలన్నింటిని అన్ని గుర్తించబడిన అధికారిక ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని తమ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందన్న కేటీఆర్, 2020 నవంబర్ 18న కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ కూడా రాశారని ఇటీవల రాసిన లేఖలో కేటీఆర్ కేంద్ర మంత్రి అమిత్ షాకు గుర్తుచేశారు.






సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ వంటి కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగ ఖాళీల వివరాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా విభాగాల్లో మొత్తంగా 10,15,237 పోస్టులకు గాను ఈ ఏడాది జనవరి 1 నాటికి 83 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు. ఉద్యోగ ఖాళీల భర్తీ నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. కేంద్ర సాయుధ బలగాల్లో (సీఆర్‌పీఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ), సశస్త్ర సీమాబల్ (ఎస్‌ఎస్‌బీ), అస్సాం రైఫిల్స్ విభాగాలు ఉన్నాయి.