తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు ప్రక్రియ ఆలస్యరుసుము లేకుండా ఏప్రిల్ 10తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఎంసెట్‌కు మొత్తంగా  3,05,185 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇంజినీరింగ్‌ కోర్సులకు 1,95,515 దరఖాస్తులు రాగా.. అగ్రికల్చర్‌, మెడికల్‌ కోర్సుల్లో 1,09,335 దరఖాస్తులు అందాయి. ఏపీ నుంచి ఈసారి భారీగా దరఖాస్తులు రావడం విశేషం. దరఖాస్తు గడువు ముగియడంతో వివరాల్లో సవరణకు ఏప్రిల్ 12 నుంచి 14 వరకు అవకాశం కల్పించారు. 


ఎంసెట్‌కు దరఖాస్తు చేసిన వారిలో వందల మంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల పేర్లు తప్పుగా రాశారు. ఆధార్ సంఖ్య, జెండర్, కుటుంబ ఆదాయం తదితర వివరాల నమోదులోనూ పొరపాట్లు చేశారు. ఆ తప్పులను విద్యార్థులు తాజాగా సరిచేసుకున్నారు. ఇంజినీరింగ్ విభాగానికి దరఖాస్తు చేసిన వారిలో 3,115 మంది, అగ్రికల్చర్‌లో 937 మంది కలిపి మొత్తం 4052 మంది విద్యార్థులు తప్పులను సరిచేసుకున్నారు.


వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు మైనారిటీ, సబ్ మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ తదితర కేటగిరీల్లో నమోదు చేసిన తప్పులను సవరించుకున్నారు. తప్పులు సవరించుకున్న వారిలో అధిక శాతం మంది ఇతర బోర్డుల (సీబీఎస్‌ఈ, ఓపెన్ స్కూల్, ఏపీ ఇంటర్ బోర్డు, పాలిటెక్నిక్ డిప్లొమా) విద్యార్థులే ఉంటారని ఎంసెట్ కో కన్వీనర్ ఆచార్య విజయకుమార్ రెడ్డి తెలిపారు. ఆయా కళాశాలల ప్రతినిధులు, ఇంటర్ నెట్ కేంద్రాల వారు దరఖాస్తులు నమోదు చేస్తుండటం కూడా పొరపాట్లకు కారణమని నిపుణులు భావిస్తున్నారు.


3.15 లక్షల మంది దరఖాస్తులు
ఆలస్య రుసుం రూ.250తో ఎంసెట్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 15తో ముగియనుంది. అయితే ఏప్రిల్ 14 నాటికి 3.15 లక్షల మంది దరఖాస్తు చేశారు. గతేడాది మొత్తం 2.66 లక్షల దరఖాస్తులు రాగా...ఈ సారి ఇప్పటివరకు 49 వేలు అధికంగా అందడం గమనార్హం.


ఆలస్య రుసుముతో అవకాశం..
విద్యార్థులు రూ.250 - రూ.5000 వరకు ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో రూ.250 అపరాధ రుసుముతో ఏప్రిల్ 15 వరకు, రూ.1000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 20 వరకు, రూ.2500 అపరాధ రుసుముతో  ఏప్రిల్ 25 వరకు, రూ.5000 అపరాధ రుసుముతో దరఖాస్తుకు మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు ఏప్రిల్ 12, 14 తేదీల‌ మధ్య దరఖాస్తు వివరాల్లో ఏమైనా తప్పుంటే సరి చేసుకోవచ్చు.  


దరఖాస్తు ఫీజు ఇలా..
దరఖాస్తు ఫీజుగా  ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.500, మిగ‌తా కేట‌గిరిల అభ్యర్థులు రూ. 1000 చెల్లించి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఇంజినీరింగ్, మెడిక‌ల్ ప్రవేశ ప‌రీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.1000, మిగ‌తా కేట‌గిరిల అభ్యర్థులు రూ. 1800 చెల్లించాల్సి ఉంటుంది. 


షెడ్యూలు ప్రకారం ఎంసెట్ ఇంజినీరింగ్‌ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. నీట్‌, టీఎస్‌పీఎస్సీ నిర్వహించే పరీక్షల కారణంగా షెడ్యూల్‌లో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. అయితే.. మే 10, 11 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షను మాత్రం యథాతథంగా నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి తెలిపింది.


ఎంసెట్‌ షెడ్యూల్‌ ఇలా..

➥ ఎంసెట్‌ నోటిఫికేషన్‌ వెల్లడి:  28.02.2023


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.03.2023.


➥ దరఖాస్తుకు చివరితేదీ (అపరాధ రుసుము లేకుండా): 10.04.2023. 


➥ దరఖాస్తుల సవరణ: 12.04.2023 - 14.04.2023.


➥ రూ.250 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 15.04.2023.


➥ రూ.1000 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 20.04.2023.


➥ రూ.2500 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 25.04.2023.


➥ రూ.5000 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 02.05.2023.


➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: 30.04.2023 నుంచి


➥ పరీక్ష తేదీలు:  మే 12 నుంచి 14 వరకు ఇంజినీరింగ్; మే 10, 11 తేదీల్లో ఫార్మసీ, అగ్రికల్చర్ పరీక్షలు.


Also Read:


ఇంటర్ అకడమిక్ ​క్యాలెండర్​ విడుదల, ఈ ఏడాది వచ్చే సెలవులివే!
తెలంగాణలో జూనియర్ కళాశాలల అకడమిక్ ​క్యాలెండర్​ని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్​ కళాశాలలు జూన్​ 1న ప్రారంభమవుతాయిన బోర్డు అధికారులు ఏప్రిల్ 1న వెల్లడించారు. జూన్ 1 నుంచే తరగతులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక విద్యా క్యాలెండర్ బోర్డు వెలువరించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..