రాజకీయంగా ఎప్పుడూ లేనంత సవాళ్లను ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంత కాలం బిగబట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఒక్క సారిగా ప్రకటించేశారు. ఎవరూ ఊహించని విధంగా 80వేల ఉద్యోగాల భర్తీని.. మరో 11వేల మంది ఉద్యోగుల్ని క్రమబ్దదీకరణ చేస్తున్నట్లుగా అసెంబ్లీలో ప్రకటించారు. నిజానికి ఈ ప్రకటన కోసం నిరుద్యోగులు ఏడేళ్లుగా ఎదురు చూస్తున్నారు. నిధులు, నీళ్లు, నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణలో.. నిధులు, నీళ్ల విషయంలో ఎలాంటి అసంతృప్తి లేనప్పటికీ నియామకాలు మాత్రం ఎప్పటికప్పుడు పెండింగ్ పడిపోతూనే ఉన్నాయి. ఎడెనిమిదేళ్లలో తెలంగాణలో గ్రూప్ వన్, టు ఉద్యోగాలు భర్తీ చేయలేదంటే యువతకు అసంతృప్తి ఉండటం సహజమే. ఇప్పుడు పేరుకుపోయిన ఆ అసంతృప్తిని తగ్గించి ఒక్క సారిగా సానుకూలతగా మార్చుకోవడానికి కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటించారు. 



ఉద్యోగాల భర్తీతో పొలిటికల్‌గా కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్ కొట్టినట్లే !


" నా చావుకు కారణం కేసీఆర్ " అంటూ నిరుద్యోగులు లెటర్లు రాసి సూసైడ్ చేసుకుంటున్నప్పుడు తెలంగాణ సమాజం మనసు చివుక్కుంది. రాజకీయ పార్టీలు ఆందోళనలు చేశాయి. కేసీఆర్‌పై కేసు పెట్టాలని డిమాండ్ చేశాయి. అన్ని రాజకీయ పార్టీలు నిరుద్యోగులకు నైతిక  భరోసా ఇస్తూ కార్యక్రమాలు నిర్వహించాయి. కానీ అధికారపార్టీ వైపు నుంచి మాత్రం ఇప్పటి వరకూ ఉద్యోగాలను లక్షల సంఖ్యలో భర్తీ చేశామని.. చెబుతూ వస్తున్నారు. గత రెండు, మూడేళ్ల నుంచి త్వరలో ఉద్యోగాలభర్తీ అనే  మాటనే వినిపిస్తున్నారు. కానీ నోటిఫికేషన్ల జాడే లేదు. చివరికి కేసీఆర్ ఇప్పుడు సరైన సమయంగా భావించారు. ఉద్యోగాల ప్రకటన అసెంబ్లీలో చేశారు. నిరుద్యోగులు ఊహించిన దాని కన్నా ఎక్కువ ఉద్యోగాల భర్తీనే ప్రకటించారు.







పద్దతిగా భర్తీ ప్రక్రియను పూర్తి చేయడం ముఖ్యం !


అధికారికంగా నోటిఫికేషన్ రాలేదు. కానీ ఈ క్షణం నుంచే దరఖాస్తు చేసుకోవచ్చని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ మాటల ప్రకారం చూస్తే అధికారికంగా టీఎస్ పీఎస్సీ కావొచ్చు... ఇతర నియామక సంస్థలు కావొచ్చు.. తమ తమ శాఖల్లో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లను జారీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంటుంది. మూడు లేదా నాలుగు నెలల్లో ఉద్యోగాల భర్తీ పూర్తి చేసి..  నియామక పత్రాలు అందించి.. ఎనభై వేల మందిని కొత్తగా ఉద్యోగులుగా మార్చాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ముందున్న లక్ష్యం ఇదే. గతంలో నోటిఫికేషన్లు రావడం.., కొంత మంది కోర్టుల్లో పిటిషన్లు వేయడం..అవి ఆగిపోవడం అనేది కామన్‌గా జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి లొసుగులకు... న్యాయపరమైన వివాదాలకు తావివ్వకుండా భర్తీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏ ఒక్క నోటిఫికేషన్‌కు న్యాయపరమైన అడ్డంకులు ఎదురైనా ఉద్యోగాల భర్తీ పేరుతో కేసీఆర్ కొత్త నాటకం ఆడుతున్నారన్న విమర్శలు పెరడానికి కారణం అవుతాయి. 


వరదసాయం.. దళిత బంధులాగా చేస్తే మొదటికే మోసం !


 సీఎం కేసీఆర్‌పై తెలంగాణ ప్రజల్లో ఓ అభిప్రాయం ఉంది. అదేమిటంటే.. ముందుగా బెల్లం ముక్క ఒకరిద్దరికి ఇచ్చి మిగతా అందరికీ ఆశ చూపించి... ఓట్లు వేయించుకుని తర్వాత మర్చిపోతారని. 2015 గ్రేటర్ ఎన్నికల సమయంలో సనత్ నగర్ నియోజకవర్గంలో ఓ పదో..ఇరవయ్యో డబుల్ బెడ్ రూం ఇళ్లను చకచకా నిర్మించారు. వాటిని చూపించి ఆ గ్రేటర్ ఎన్నికల్లో గెలిచారు. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉపయోగించుకున్నారు. కానీ ఏడేళ్ల తర్వాత ఆ డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్దిదారులు ఎంత మంది అంటే స్పష్టత లేదు. ఆ తర్వాత హైదరాబాద్‌లో వరద సాయం.. చివరికి దళిత బంధు విషయంలోనూ అదే జరిగింది. హుజురాబాద్ ఎన్నికలకు ముందు ఆ నియోజకవర్గంలో వారికి  దళిత  బంధు ఇచ్చిన సీఎం కేసీఆర్ .. ఎన్నికలు ముగిసిన తర్వాత సైలెంటయ్యారు. నాలుగు మండలాల్లో వంద శాతం దళితులకు సాయం చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించడం లేదు. నియోజకవర్గానికి వందమందికి ఇస్తామని ప్రకటించారు. ఆ ప్రాసెస్ నడుస్తోంది.ఈ విషయంలోనూ కేసీఆర్‌కు రిమార్కులే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఉద్యోగాల భర్తీ కూడా ఇదే తరహాలో ఉంటుందా అన్న సందేహాలు సహజంగానే నిరుద్యోగుల్లో ఉన్నాయి. 
 


ముందస్తు ఎన్నికలకు ముడిపెట్టకుండా నియామకాలు పూర్తయితేనే కేసీఆర్‌కు ప్లస్!


కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారన్న ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. ఒక వేళ అదే నిజం అయితే.. ఉద్యోగాల  భర్తీ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి వెళ్లాల్సి ఉంటుంది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మధ్యలో ఉన్నప్పుడో లేకపోతే... నోటిపికేషన్ల విడుదలకే సమస్యలు వచ్చినప్పుడో ఎన్నికలకు వెళ్తే నిరుద్యోగులు నమ్మే అవకాశం ఉండదు. కేసీఆర్ ప్రభుత్వానికి ఇంకా వచ్చే ఏడాది చివరి వరకు సమయం ఉంది. ఈ లోపు ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంది. 


ప్రక్రియ నిలిచిపోతే బీజేపీ, కాంగ్రెస్‌లపై నిందలేసినా ప్రయోజనం ఉండదు..!


ఉద్యోగాల భర్తీకి ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. వివిధరకాల పిటిషన్లు హైకోర్టులో పడే అవకాశం ఉంది. అదే సమయంలో ఇతర సమస్యలూ వస్తాయి. అయితే అన్నింటినీ అధిగమించి.. ఉద్యోగాల భర్తీ చేయాల్సి ఉంది. సమస్యలు వచ్చినప్పుడు ... ప్రక్రియ నిలిపివేసి..బీజేపీ, కాంగ్రెస్‌లు అడ్డుకున్నాయని ఎన్నికలకు వెళ్తే.. అదిటీఆర్ఎస్‌కు ఇబ్బందికరమే కానీ ప్లస్ అయ్యే అవకాశం ఉండదు. నిరుద్యోగుల ఆగ్రహం టీఆర్ఎస్ పైనేఉంటుంది కానీ.., నోటిఫికేషన్లు ఆగిపోయాయని.. దానికి విపక్షాలే కారణం అనికేసీఆర్ ఆరోపిస్తే నమ్మే పరిస్థితి ఉండదు. అందుకే.. ప్రకటన చేసినంత ఈజీగా కేసీఆర్.. ఉద్యోగాల భర్తీని కూడా పూర్తి చేస్తేనే.. రాజకీయంగా ప్రయోజనం లభిస్తుంది. లేకపోతే.. ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి రావొచ్చు.