Telangana News: కాంగ్రెస్ ప్రభుత్వం సన్న రకం వరి పంటకు రూ.500 బోనస్ ప్రకటించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు. ఎన్నికలకు ముందు వరి పంట మొత్తానికి రూ.500 బోనస్ ఇస్తానని ప్రకటించి.. ఇప్పుడు కేవలం సన్నాలకే దాన్ని పరిమితం చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నయవంచనకు గురి చేసిందని.. వారికి కౌంట్ డౌన్ రైతుల నుంచే మొదలవుతుందని అన్నారు.


‘‘గ్యారెంటీ కార్డులో “వరిపంటకు” రూ.500 బోనస్ అని ప్రకటించి.. ఇప్పుడు “సన్న వడ్లకు మాత్రమే” అని సన్నాయి నొక్కులు నొక్కుతారా?? ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి.. ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా?? ఇది ప్రజా పాలన కాదు.. రైతు వ్యతిరేక పాలన. నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారు.. కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారు.. కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలపాలు చేసి ఆగం చేశారు.. ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు రైతు భరోసా అన్నారు.. ఇవ్వలేదు. 


వ్యవసాయ కూలీలకు రూ.12000 వేలు అన్నారు.. వేయలేదు. ప్రతి రైతుకు డిసెంబర్ 9నే.. రెండు లక్షల రుణమాఫీ అన్నారు.. చేయలేదు. నేడు బోనస్ విషయంలో కూడా ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టారు. ఓట్ల నాడు ఒకమాట.. నాట్ల నాడు మరోమాట చెప్పడమే కాంగ్రెస్ నైజం. అసెంబ్లీ ఎన్నికల్లో గాలిమాటలతో గారడీ చేసింది.. కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే.. నాలుగు కోట్ల ప్రజల సాక్షిగా తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది.. కాంగ్రెస్ సర్కారు. 


ఎద్దేడ్సిన యవుసం.. రైతేడ్చిన రాజ్యం నిలబడదు.. నమ్మి ఓటేసినందుకు.. రైతుల గొంతు కోసిన కాంగ్రెస్ సర్కారును అన్నదాతలు ఇక వదిలిపెట్టరు.. పల్లె పల్లెనా ప్రశ్నిస్తారు.. తెలంగాణ వ్యాప్తంగా నిలదీస్తారు.. కపట కాంగ్రెస్ పై సమరశంఖం పూరిస్తారు.. నేటి నుంచి రైతన్నల చేతిలోనే.. కాంగ్రెస్ సర్కారుకు కౌంట్ డౌన్ షురూ.. ’’ అని కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.