BRS Chief KCR at Telangana Bhavan: హైదరాబాద్: త్వరలో జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కరీంనగర్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజక వర్గ బీఆర్‌ఎస్‌ నేతలతో ఆదివారం నాడు కేసీఆర్ సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో భాగంగా ఈ నెల 12న సెంటిమెంట్‌గా వస్తున్న ఎస్సారార్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. 


లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానంలో బీఆర్‌ఎస్‌ గెలువ బోతుందన్నారు. అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందన్న కేసీఆర్.. బీఆర్‌ఎస్‌తో మేలు జరుగుతుందని ప్రజల్లో చర్చ మొదలైందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పట్టించుకోవద్దని శ్రేణులకు కేసీఆర్ సూచించారు. నేతలు, కార్యకర్తలు అధైర్య పడొద్దని, పార్టీ నేతలంతా కలిసి పని చేసి ఎన్నికల్లో విజయం సాధించాలని ఆయన సూచించారు. 


కరీంనగర్‌లో బీఆర్ఎస్ బహిరంగసభ 
కరీంనగర్‌ నుంచి బీఆర్‌ఎస్‌ ఎన్నికల శంఖారావం పూరించనుంది. ఈ నెల 12న కరీంనగర్‌లో బీఆర్ఎస్ బహిరంగసభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభను బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో నేడు మొదట కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనేతలతో సమావేశమై ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. అనంతరం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు


ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో గతంలో బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ విమర్శించిందని కేటీఆర్‌ గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ చేస్తామని మాట ఇచ్చిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్‌ ను ఉచితంగా చేయాలని కేటీఆర్ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు నీళ్లు, కరెంటు ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సహజమని.. మిడ్ మానేరులో సమస్యలు వస్తే వెంటనే మరమ్మతులు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. సమస్య వస్తే ప్రభుత్వాలు వెంటనే పూనుకొని పరిష్కరించాలన్నారు. ఒక పన్ను పాడైతే.. చికిత్స చేసుకుంటాం అంతే కానీ.. మొత్తం పళ్లన్నీ పీకి వేసుకోలేం కదా? అన్నారు.