Harish Rao on Revanth Reddy Comments: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆరోపించడం విడ్డూరం అని కొట్టిపారేశారు. మెదక్ లో బీజేపీని బీఆర్ఎస్ పార్టీయే గెలిపించిందని సీఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదని అన్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో మూడు చోట్ల బీఆర్ఎస్ మెజారిటీ సాధించిందని గుర్తు చేశారు.


రఘునందన్ రావు సొంత నియోజకవర్గం దుబ్బాకలో కూడా బీఆర్ఎస్ మెజారిటీ సాధించింది. రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డి పల్లిలో బీజేపీకి మెజారిటీ వచ్చింది. రేవంతే అక్కడ బీజేపీకి కాంగ్రెస్ ఓట్లు మళ్లించారా? రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన మహబూబ్ నగర్ లో బీజేపీ ఎలా గెలిచింది. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. వారంతా కలిసి బీజేపీని గెలిపించారా?


కొడంగల్లో రేవంత్ రెడ్డి 32 వేల మెజారిటీతో గెలిచారు. పార్లమెంటు ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 21 వేల మెజారిటీ మాత్రమే వచ్చింది. మిగతా ఓట్లను రేవంత్ రెడ్డి బిజెపికి వేయించారా? రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహించిన మల్కాజిగిరిలో బిజెపి భారీ మెజారిటీతో ఎలా గెలిచింది. ఈ రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ బిజెపిని గెలిపించిందా?


బిజెపి పంచన చేరింది, మోదీ శరణు చొచ్చింది రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఉండి బిజెపి ఎజెండా అమలు చేస్తున్నది రేవంత్ రెడ్డి. నిండు సభలో మోదీని పెద్దన్న అని సంబోధించింది రేవంత్ రెడ్డి. మోదీ, రేవంత్ రెడ్డి కుమ్మక్కై సింగరేణని ప్రైవేటు పరం చేస్తున్నారు. విభజన హామీలపై రేవంత్ రెడ్డి మోదీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం లేదు. రెండు జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ శక్తి అయిన బీఆర్ఎస్ ను టార్గెట్ చేశాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గు చేటు’’ అని హరీశ్ రావు విమర్శలు చేశారు.