Telangana News: తెలంగాణ రైతుల ఆత్మహత్యలు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రంలో రైతుల చావులు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం దుర్మార్గమని అన్నారు. మొన్న ఖమ్మం జిల్లాలో ఓ రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలాడని గుర్తు చేశారు. తన సమస్యకు పరిష్కారం చూపడం లేదనే ఆవేదనతో నిన్న సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంకో రైతు ఆత్మహత్యకు యత్నించాడని అన్నారు. మళ్లీ ఈరోజు ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం, ఆలియా తండాలో మరో రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలేందుకు సిద్ధమయ్యాడని సంబంధిత వీడియోను హరీశ్ రావు షేర్ చేశారు.


హరీశ్ రావు గురువారం ఎక్స్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఓ రైతు తన పొలంలోనే పురుగుల మందు తాగి పడిపోయి ఉన్నాడు. అతని భార్య తన భర్తను చూసి రోదిస్తూ ఉండడం పలువుర్ని కంటతడి పెట్టిస్తోంది.


‘‘రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం. ఖమ్మం జిల్లాలో మొన్న ఒక రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలితే, తన సమస్యకు పరిష్కారం చూపడం లేదనే ఆవేదనతో నిన్న సీఎం గారి సొంత జిల్లాలోనే ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 
ఈ ఘటనలు మరువక ముందే నేడు ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం, ఆలియా తండాలో మరో రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలేందుకు సిద్ధమయ్యారు. 


రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు, వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించకపోవడం బాధాకరం. ఈ ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ, పట్టెడన్నం పెట్టే రైతుల సంక్షేమం పట్ల లేదు. పురుగుల మందే రైతన్నలకు పెరుగన్నం అయ్యే దుర్భర పరిస్థితులను ఏడు నెలల కాంగ్రెస్ పాలన మళ్లీ తీసుకువచ్చింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, రైతుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.