KTR Counter To CM Revanth Reddy: సింగరేణి గనుల వేలం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎందుకు మౌనం వహిస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (KT Rama Rao) ప్రశ్నించారు. శుక్రవారం కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సింగరేణి గనుల (Singareni Mines) వేలాన్ని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకించడం లేదని నిలదీశారు. తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకు కేంద్రం నేరుగా కేటాయించాలని మాట్లాడిన రేవంత్ ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మౌనం వహించడం అనేక ప్రశ్నలు, అనుమానాలకు తావిస్తుందని విమర్శించారు. 


ప్రజలకు చెప్పాల్సిందే
సింగరేణి గనుల వేలానికి ఉపముఖ్యమంత్రిని పంపించడం, ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ అవకాశవాదానికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. గనుల వేలం విషయంలో మారిన కాంగ్రెస్ వైఖరి, దీని వెనుక ఉన్న ఒత్తిడిలను ఏంటో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గనుల వేలం ద్వారా సింగరేణి సంస్థ ప్రైవేట్ పరం అవుతుందని, పెట్టుబడుల ఉపసంహరణకు దారితీస్తుందనే అంశాన్ని రేవంత్ రెడ్డి అంగీకరిస్తారో లేదో తెలపాలన్నారు. గుజరాత్, ఒడిశా తరహాలోనే తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు గనులను కేటాయించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించలేకపోతుందని నిలదీశారు. 


ఇదేనా తెలంగాణపై ఉన్న ప్రేమ
సింగరేణి గొంతు కోసేలా నిర్వహిస్తున్న గనుల వేలం పాటలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎలాంటి ఆందోళన బాధ లేకుండా పాల్గొనడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణపై జరుగుతున్న ఈ కుట్రల్లో చిరునవ్వులు చిందిస్తూ వారు పాల్గొనడం రాష్ట్రంపై వారికి ఉన్న ప్రేమను సూచిస్తుందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డికి తెలంగాణపై ప్రేమ, సింగరేణి కార్మికులపై అభిమానం ఏమాత్రం లేదన్నారు. వేలాది మంది కార్మికుల పొట్టగొట్టి, వందేళ్ల సంస్థ భవిష్యత్తును చీకట్లోకి నెట్టేసి.. పూలబొకేలతో ఫోటోలకు ఫోజులిచ్చారని ధ్వజమెత్తారు. 


అందుకే ఫిరాయింపుల డ్రామా
కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతూ.. సింగరేణి సంస్థకు మరణ శాసనం రాసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నుంచి తెలంగాణ ప్రజల దృష్టికి మరల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికెళ్లి ఫిరాయింపుల డ్రామాకు తేరలేపారని కేటీఆర్ ఆరోపించారు. ఆరు నెలలైనా ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయలేని అసమర్ధతను కప్పిపుచ్చుకుంటూ ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ ఆగమైందని, బీజేపీ నీతి లేని నిర్ణయాల్లో కాంగ్రెస్ కూడా భాగమైందని ఆరోపించారు. ఈ రెండు జాతీయ పార్టీలకు ఓటు వేసి గెలిపిస్తే, తెలంగాణ జాతి ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
Also Read: రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, కటాఫ్ డేట్ వెల్లడించిన రేవంత్ రెడ్డి


తెలంగాణ ప్రజానీకం క్షమించదు
తొమ్మిదేళ్ల నుంచి తెలంగాణ సహజ సంపదను బీఆర్ఎస్ పార్టీ కంటికి రెప్పలా కాపాడిందని కేటీఆర్ అన్నారు. కానీ కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ సంపదలను దోచుకుంటున్నాయని, గనులను సింగరేణికి కేటాయించకుండా వేలం వేస్తున్నారని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలను తెలంగాణ ప్రజానీకం ఎప్పటికి క్షమించదని అన్నారు. పైకి కొట్టుకుంటున్నట్లు ఉన్నా.. లోలోపల బీజేపీ, కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. సింగరేణికి మరణశాసనం రాస్తున్న వేలంలో నిస్సిగ్గుగా పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు.