హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో శనివారం సాయంత్రం 6 గంటలకే ప్రచార గడువు ముగిసింది. అయితే గడువు పూర్తయిన తరువాత సైతం కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీపై సీఈవో వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్ లో ఎలాంటి ప్రచారం నిర్వహించరాదు అనే ఎలక్షన్ కమిషన్ నిబంధనల్ని కాంగ్రెస్ పార్టీ ఉల్లంఘించినట్లు తమ ఫిర్యాదులో బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. 


సోమవారం (మే 13న) ఉదయం పోలింగ్ ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో సైతం కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. టీపీసీసీ సైతం సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తోందని అందుకు తగిన ఆధారాలను సమర్పించారు. ఈసీ ఇచ్చిన గడువు ముగిసినా ప్రచారం చేయడంపై చర్యలు తీసుకోవాలని ఈసీతోపాటు తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. 


మధుయాష్కి గౌడ్ ఇంటి వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్  తనిఖీలు 


టిపిసిసి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాసి గౌడ్ ఇంటి వద్ద ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్  అధికారులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న తరుణంలో హయత్ నగర్ లోని మధుయాష్కి గౌడ్ నివాసానికి చేరుకుని టీమ్ తనిఖీలు చేపట్టింది. లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలు జరుగుతున్నాయన్న  ఫిర్యాదు మేరకు ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మధు యాస్కి  నివాసంతో పాటు పరిసర ప్రాంతాలను సైతం ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ తనిఖీ చేసినట్లు సమాచారం. వారికి అధికారులకు అక్కడ ఎలాంటి ఎన్నికల కార్యక్రమాలు జరిగినట్లు  ఆధారాలు దొరకపోవడంతో వెనుదిరిగారు.