Telangana CM KCR : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ క్షణంలోనైనా అసెంబ్లీ రద్దు చేసే అవకాశం ఉందని, ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చునని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పుట్టబోయే బిడ్డ కూడా లక్షా 25 వేల అప్పుతో పుడుతున్నారని, అందుకు బాధ్యుడు కేసీఆర్ అన్నారు. ఎదులాబాద్, మరిపల్లి గూడెంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసిఆర్ నైజం తెలంగాణ ప్రజలకు తెలిసిందని, రాష్ట్రాన్ని నడిపేది కేవలం ఆయన కుటుంబమేనని.. తెలంగాణ వచ్చే నాటికి నీ దగ్గర ఉన్న డబ్బు ఎంత? అని సీఎం కేసీఆర్‌ను హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల ప్రశ్నించారు.


అవినీతి లేకపోతే రూ.600 కోట్ల ఖర్చు ఎందుకు
తెలంగాణ ప్రభుత్వం నీతిగా, న్యాయంగా పాలన సాగిస్తున్నట్లయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తనను ఓడించేందుకు రూ.600 కోట్ల ఎందుకు ఖర్చు పెట్టారు. అంత డబ్బు నీకు ఎలా వచ్చింది. ఎవరిదగ్గర తీసుకున్నావు. చెప్పే మాటలకు, చేసే చేతలకు పొంతన లేని నేత కేసీఆర్. ఆయన ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ ప్రజలు తన వెంట నిలిచి, తెలంగాణ ఆత్మగౌరవం కాపాడి, సీఎం కేసీఆర్ చెంప చెళ్లుమనిపించారని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. 


కేసీఆర్‌కు మళ్లీ దిమ్మ తిరిగింది..
‘తొలిసారి ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ప్రజలు కొట్టిన దెబ్బకు సీఎం కేసీఆర్ దిమ్మతిరిగింది. తాజాగా ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 4 రాష్ట్రాలు కొట్టిన దెబ్బతో సీఎం కేసీఆర్‌కు మళ్లీ దిమ్మ తిరిగింది. కుట్లో రాయి తీయలేని వాడు ఎట్లో రాయి తీస్తా అని పోయినట్టు ఉంది కేసీఆర్ వ్యవహారం. అసెంబ్లీకి వెళ్లి సమస్యలపై మాట్లాడాలని హుజూరాబాద్ ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించి పంపించారని, కానీ సమావేశాలకు హాజరు కాకుండా బీజేపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కారని’ ఈటల ఆరోపించారు. కోర్టులను సైతం కేసీఆర్ మేనేజ్ చేసి బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.


ఓటుకు రూ.10 వేలు తీసుకోండి..
కేసీఆర్ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడకముందు ఉన్న డబ్బులు కావు అవి. అంతా అక్రమంగా సంపాదించినవే. వచ్చే ఎన్నికల్లో రూ.10 వేలు ఇస్తారంట. డబ్బులు తీసుకుని ధర్మానికి ఓటు వెయ్యాలని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. 


‘ప్రపంచంలోనే ఎక్కువ సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ. మొన్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆశీర్వదించారు. బీజేపీ రేపటి అడ్డా తెలంగాణ. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో అన్యాయం జరగకుండా పాలన చేస్తున్నారు. కానీ సామాన్యులే మా నాయకులు. చరిత్ర తిరగరాసేది ప్రజలే. రేపు ఎన్నికల్లో కేసీఆర్ వర్సెస్ తెలంగాణ ప్రజలుగా జరగబోతున్నాయి. మోకాళ్ల మీద నడిచినా కేసీఆర్‌కు ప్రజలు ఓట్లు వేయరు. వాళ్లు డబ్బు, మద్యం, కుట్రలను నమ్ముకున్నారని’ ఈటల ఆరోపించారు.


మద్యం ఆదాయం..
కేసీఆర్ ప్రభుత్వం కేవలం మద్యం ఆదాయంతో బతికేస్తుందని, ప్రభుత్వానికి రూ.37 వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలెక్టర్లకు ఫోన్లు చేసి కేవలం మద్యం అమ్మకాల గురించి తెలుసుకుంటున్నారు. ఈ మద్యం ఎంతమంది ఆడబిడ్డల పుస్తెలు తెంపుతుందో కేసీఆర్ తెలుసుకోవాలి అన్నారు. తాగించడంలో కేసీఆర్ ప్రభుత్వం నెంబర్ వన్‌లో ఉంది. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని, 3.25 లక్షల కోట్లు డైరెక్ట్ అప్పు ఉంటే.. 1 లక్షా 5 వేల కోట్లు కార్పొరేషన్ల అప్పులు ఉన్నాయని. పుట్టబోయే బిడ్డ కూడా 1 లక్ష 25 వేల రూపాయల అప్పుతో పుడుతుందని చెప్పారు.


రాజ్యాంగం మార్చే హక్కు లేదు..
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చే హక్కు పార్లమెంట్ కి కూడా లేదు అని కేసీఆర్ తెలుసుకోవాలి. కానీ ఈయన మాత్రం రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నారు. కేసీఆర్ పాలన తెలంగాణకు అరిష్టం. ఇదో దుర్మార్గమైన ప్రభుత్వం. ఇలాగే పాలన కొనసాగితే బానిసత్వంలో కూరుకుపోతం. మరోవైపు కేసీఆర్ ఏ క్షణంలోనైనా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. 


Also Read: Mallareddy Comedy: కేంద్రమోళ్లు రామా చంద్రా అనాలె, వీళ్లు డుర్రు డుర్రుమంటూ తిరగాల - మల్లారెడ్డి పంచ్‌లు, కేటీఆర్ నవ్వులు 


Also Read: TRS Jumpings : ఆ ముగ్గురు సీనియర్లు టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పబోతున్నారా ? వాళ్లెవరు ?