Maoist Hidma : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మాడావి హిడ్మా  హతమయ్యాడని సమాచారం. బీజాపూర్‌-తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మృతిచెందినట్లు తెలుస్తోంది.  తెలంగాణ గ్రేహౌండ్స్‌, సీఆర్పీఎఫ్‌ కోబ్రా జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది.  అయితే మావోయిస్టు కేంద్ర కమిటీ హిడ్మా మృతిని ధ్రువీకరించలేదు. గతంలోనూ హిడ్మా చనిపోయాడని, పోలీసులకు లొంగిపోయాడని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత మావోయిస్టులు హిడ్మాపై ప్రకటన జారీచేశారు.  అగ్ర మావోయిస్టు హిడ్మా లొంగుపోయారంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వ సైకలాజికల్‌ వార్‌ చేస్తున్నారని దండకరణ్యం స్పెషల్ జోనల్ కమిటీ అప్పట్లో ఓ ప్రకటన జారీచేసింది. 43 ఏళ్ల వయసున్న హిడ్మా  దాదాపు దశాబ్ద కాలంగా దండకారణ్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులను హతమార్చాడు. దక్షిణ బస్తర్ ప్రాంతంలోని సుక్మా జిల్లాలో పువర్తి గ్రామనివాసి అయిన హిడ్మా... ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి. 1996-97 లో తన 17వ ఏట మావోయిస్టు పార్టీలో చేరాడు.  


ఆపరేషన్ హిడ్మా 


తెలంగాణ - చత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో బలగాలు ఇటీవల "ఆపరేషన్ హిడ్మా" చేపట్టింది. బలగాలకు మావోయిస్టు మోస్ట్ వాటెండ్‌గా మాడావి హి‌డ్మా ఉన్నారు. ఆయన ప్రస్తుతం మావోయిస్టు పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) ఒకటో బెటాలియన్‌ కమాండర్‌గా ఉన్నారు.  ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొందేందుకు తెలంగాణ సరిహద్దు ప్రాంతానికి హిడ్మా వచ్చారని ప్రచారం సాగింది. దీంతో బలగాలు  అడవులను జల్లెడ పట్టాయి.  


హిడ్మాపై రూ.45 లక్షల రివార్డు 


మాడావి హిడ్మా చదివింది మాత్రం 7వ తరగతే అయినా మావోయిస్టు అగ్రనేత నేతగా ఎదిగాడు.  హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో కీలక నేతగా ఎదిగాడు. అటవీ ప్రాంతంలో పోలీసులను, సీఆర్పీఎఫ్‌ జవాన్లను టార్గెట్‌ చేయడంతో హిడ్మా చాలా సార్లు సక్సెస్‌ అయ్యాడు. దీంతో అతడు పోలీసుల  హిట్‌ లిస్టులో ఉన్నాడు. ఉర్పల్‌ మెట్లలో 2007లో జరిగిన 24 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృతి, తాడిమెట్లలో 2011లో జరిగిన దాడిలో 76 మంది, 2017లో 12 మంది జవాన్లు మృతి ఘటనల్లో మావోయిస్టు హిడ్మా  కీలకపాత్ర పోషించాడని తెలుస్తోంది. మావోయిస్టు పార్టీలో మూడు విభాగాల్లో పనిచేసిన హిడ్మాపై ప్రభుత్వం 45 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది.  


హిడ్మాపై విష ప్రయోగం 


హిడ్మాపై స్లో పాయిజన్ ద్వారా విష ప్రయోగం జరిగిందన్న ప్రచారం జరిగింది. అతడు వైద్యం కోసం తెలంగాణకు వచ్చాడని కొన్నివర్గాలు తెలిపారు. ఆర్కే మృతికి కారణాలను ఆరా తీసేందుకు వచ్చాడని మరికొన్ని వర్గాలు అన్నాయి. పలిమెల, మహాదేవపూర్‌, మహాముత్తారంతోపాటు.. ములుగు జిల్లా కన్నాయిగూడెం, తాడ్వాయి, ఏటూరునాగారం, గోవిందరావుపేట అడవుల్లో హిడ్మా తలదాచుకునే అవకాశాలున్నట్లు అప్పట్లో నిఘా వర్గాలు అంచనా వేశాయి. అయితే పీఎల్‌జీఏ అగ్రనేత అయిన హిడ్మాకు నాలుగంచెల భద్రత ఉం టుంది. అంటే కనీసం పాతిక మంది సాయుధులైన మావోయిస్టులు అతనికి కాపలాగా ఉంటారు.