జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నిరసనల విషయంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. నాలుగు ఏళ్ళ ప్రొబేషనరీ కాలం పూర్తయిన జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. గత 6 రోజులుగా రాష్ట్రంలోని 9,350 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ నిరసన తెలుపుతున్నారని అన్నారు. వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్ సమంజసమైనదని, తెలంగాణలో ఇకపై కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అనే పదమే ఉండబోదని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విషయాన్ని బండి సంజయ్ లేఖలో గుర్తుచేశారు. 


కొత్త సచివాలయ భవన ప్రారంభోత్సవం నాడు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ సంతకం చేసినట్లు వార్తలు వచ్చాయని చెప్పారు. కానీ పోటీ పరీక్షలు రాసి ఉద్యోగం సాధించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పదవీ కాలం పూర్తయి నాలుగేళ్లు దాటినా వారిని ఇంతవరకు రెగ్యులరైజ్ చేయకపోవడం అన్యాయమని లేఖలో ఆయన పేర్కొన్నారు. మూడేళ్ల ప్రొబేషనరీ కాలాన్ని నాలుగేళ్లకు పొడిగించినా, అన్నింటినీ భరిస్తూ విధులు నిర్వర్తించారని అన్నారు. గడువు దాటినా నేటికీ వారిని రెగ్యులరైజ్ చేయకపోవడం దారుణమని అన్నారు.


చేతగానితనానికి నిదర్శనం


‘‘తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రొబేషనరీ కార్యదర్శులు సమ్మె చేసే స్థితికి రావడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం. మీరు మాత్రమే శ్వేత సౌధంలో సేద తీరితే సరిపోదు. ప్రజల, ఉద్యోగుల బాగోగులను పట్టించుకోవాలి. ఇకనైనా మొద్దునిద్ర వీడి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. లేనిపక్షంలో తెలంగాణ సమాజం క్షమించదు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయా ఉద్యోగాలను క్రమబద్ధీకరించండి. లేనిపక్షంలో ఆయా ఉద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించక తప్పదు.


పారిశుద్ధ్యం, పరిశుభ్రత, గ్రామాల అభివృద్ధి వంటి అంశాల్లో తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు అవార్డులు వస్తున్నాయని జబ్బలు కొట్టుకుంటున్నారు. కానీ అందులో కీలక పాత్ర వహిస్తున్న ప్రొబేషనరీ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులైన నర్సరీలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, క్రీడా ప్రాంగణాలు, కిచెన్ గార్డెన్‌లతోపాటు పల్లె ప్రగతి, హరితహారం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల అమలులో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పాత్ర క్రియాశీలం. 


రోజుకు 12 గంటలకుపైగా పని చేస్తున్న వీరితో వెట్టిచాకిరి చేయించుకున్నారే తప్ప నేటికీ ఉద్యోగ భద్రత కల్పించకపోవడం దారుణం. పైగా రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులకు, వీరికి మధ్య వైరం పెట్టేలా చర్యలున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ నిర్వాకం వల్ల గ్రామానికి వెన్నెముకలైన సర్పంచుల్లో కొందరు చేసిన పనులకు బిల్లులు రాక అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నారు’’ అని బండి సంజయ్ లేఖలో ప్రస్తావించారు.