Bandi Sanjay :   అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటరీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో కాలయాపన చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ‘‘షెడ్యూల్ ప్రకారం చూస్తే…వచ్చే మార్చి, ఏప్రిల్ లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అంతకంటే ముందే ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్ వచ్చే అవకాశముంది. ఈ విషయం తెలిసి కూడా దరఖాస్తుల కంప్యూటరీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో 6 గ్యారంటీలను అమలు చేయకుండా కాలయాపన చేయడమంటే డ్రామాలాడటమే.’’అని పేర్కొన్నారు.


కాలయాపన చేస్తే ప్రజలు సహించరు ! 


వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని వెంకటంపల్లి గ్రామానికి వచ్చిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ 6 గ్యారంటీల పేరుతో కాలయాపన చేస్తూ డ్రామాలు చేస్తే ప్రజలు హర్షించరనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.  తాము నిర్మాణాత్మకంగా మాట్లాడుతున్నామని, గత ప్రభుత్వం మాదిరిగా అహంకార పూరితంగా వ్యవహరిస్తూ ప్రతి విమర్శలు చేస్తే బీఆర్ఎస్ నేతలకు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. అసలు అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణను ఎట్లా గట్టెక్కిస్తారో,  6 గ్యారంటీలను ఎట్లా అమలు చేస్తారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఒక్కో వ్యక్తిపై లక్షన్నర రూపాయల అప్పు భారం మోపారు. వాటినెలా తీరుస్తారు? కొత్త హామీలను ఎలా తీరుస్తారోననే ఆందోళనలో ప్రజలున్నారు. వాటిని నివ్రుత్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ‘‘అట్లాగే గత 10 ఏళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇయ్యలే. రేషన్ కార్డు ప్రాతిపదికగా 6 గ్యారంటీలను అమలు చేస్తామంటే పేదలకు న్యాయం జరిగే అవకాశం లేదు. ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని, వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నా. ’’అని చెప్పారు.


కేంద్రం సాయం కావాలంటే ఎక్కువ మంది ఎంపీల్ని గెలిపించాలి!  


‘‘అప్పుల బారినుండి తెలంగాణ గట్టెక్కాలన్నా… ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధులు కావాలన్నా కేంద్ర సాయం అవసరముందని అన్నారు. కేంద్రంలో మళ్లీ రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్ని సర్వే సంస్థలు తేల్చి చెబుతున్నాయి. అట్లాంటప్పుడు కేంద్రం నుండి అదనపు నిధులు తీసుకురావాలంటే రాష్ట్రం నుండి అత్యదిక మంది ఎంపీలను గెలిపించాల్సిన అవసరం ఉంది. తద్వారా కేంద్రాన్ని మెప్పించి, ఒప్పించి అదనపు నిధులు తీసుకొచ్చే అవకాశముంది.  ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలంతా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికంగా బీజేపీ ఎంపీలను గెలిపించాలని కోరుతున్నా.’’అని విజ్ఝప్తి చేశారు.  


మాల్దీవుల అంశంలో భారతీయులకు హ్యాట్సాఫ్ 


మాల్దివుల అంశాన్ని ప్రస్తావిస్తూ… ‘‘భారత్ ను, ప్రధాని మోదీ ని దూషిస్తే… ఫలితాలు ఎట్లుంటాయో మాల్దివుల ప్రభుత్వానికి రుచి చూపించిన భారతీయులకు హ్యాట్సాఫ్ చెబుతున్నా…. భారత్ లో పర్యాటక ప్రాంతాన్ని అభివ్రుద్ధి చేసేందుకు ప్రధాని మోదీ గారు లక్ష్యద్వీప్ కు వెళితే.. మాల్దివులకు చెందిన ముగ్గురు మంత్రులు ప్రపంచం సిగ్గుపడేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు. ఈ నేపథ్యంలో ‘బాయ్ కాట్ మాల్దీవ్స్’’ అంటూ సోషల్ మీడియాలో భారతీయులు పెట్టిన పోస్టు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోంది. ఫలితంగా మాల్దీవుల్లోని 8,500 హోటల్లో చేసుకున్న బుకింగులు, 2,500 మంది విమాన టిక్కెట్లను భారతీయులు రద్దు చేసుకున్నారు. దీనివల్ల మాల్దీవులకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన ఆ దేశ ప్రభుత్వం ఆ ముగ్గురు మంత్రులను తొలగించి… వారి వ్యాఖ్యలు వ్యక్తిగతమని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది… భారత్ ఐక్యతను మాల్దివులకు రుచి చూపించిన భారతీయులకు హ్యాట్సాఫ్ చెబుతున్నా… హిందూ ధర్మరక్షణ, దేశ రక్షణ, దేశ ఐక్యత విషయంలో ఇదే పంథాను కొనసాగించాలని ప్రతి ఒక్క భారతీయుడిని కోరుతున్నానన్నారు.