Bandi sanjay :   తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి పేపర్ లీకేజీ వల్ల నష్టపోయిన 30 లక్షల మంది విద్యార్థులతో.. నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రకటించారు.  బుధవారం ఆయన హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం సమయంలో మిలియన్ మార్చ్ తరహాలో.. 30 లక్షల మంది స్టూడెంట్స్ తో నిరుద్యోగ మార్చ్ నిర్వహించి తీరతామని తెలిపారు.  పేపర్ లీకేజీ కేసులో సిట్ ఇప్పటి వరకు సాధించిందేమీ లేదని.. సీఎం సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ గా సిట్ దర్యాప్తు ఉందని ఎద్దేవ చేశారాయన. టీఎస్ పీఎస్ పేపర్ లీక్ కేసులో తాము సిట్ దర్యాప్తును ఒప్పుకోవట్లేదని.. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.                   

  


నయీం కేసు, మియాపూర్ భూకుంభకోణం,  డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తు ఏమైందని ప్రశ్నించారు. తప్పు చేయనప్పుడు సిట్టింగ్ జడ్జితో ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. సిట్ నోటీసులివ్వాల్సింది తమకు కాదని.. సీఎం కేసీఆర్, కేటీఆర్ లకు ఇవ్వాలన్నారు. పేపర్ లీక్ కేసుపై ఎవరు మాట్లాడకుండా నోటీసులిస్తున్నారని మండిపడ్డారాయన. 30 లక్షల నిరుద్యోగుల బతుకులు ఆగం చేయడం సర్వసాధారణమా.? అని ప్రశ్నించారు.  ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆపబోమన్నారు. తప్పు చేస్తే కేసులు పెట్టాలి కానీ   తీన్మార్ మల్లన్న ఇంటిపై దాడి చేయడమెందుకని  బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రభుత్వ లోపాలను ప్రశ్నించే అన్ని మీడియా సంస్థల గొంతు నొక్కుతున్నారని విమర్శించారు.  మీడియా కూడా ఏకం కావాల్సిన అవసరముందన్నారు. మళ్లీ ఎమర్జెన్సీ రోజులు స్టార్ట్ అయ్యాయని చెప్పారు.                                        


ఉద్యోగ పరీక్షల పేపర్ల లీకేజీ కేసుల్లో తనకు నోటీసులు ఇచ్చే ధైర్యం ఉందా అని సిట్ అధికారులపై సోమవారం బండి సంజయ్ చాలెంజ్ చేశారు. మంగళవారం ఆయనకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రశ్నాపత్నాల లీకేజీ విషయంలో బండి సంజయ్ చేసిన ఆరోపణలకు ఆధారాలివ్వాలని 24వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఇలాంటి ఆరోపణలు చేసిన  టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. ఆయనను 23వ తేదీన ఆధారాలు తీసుకుని తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పుడు బండి సంజయ్ వంతు వచ్చింది.           


సిట్ ఎదుట బండి సంజయ్ హాజరు అవుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. అయితే ఇటీవల మహిళా కమిషన్ నోటీసులు  ఇచ్చినా బండి సంజయ్ హాజరయ్యారు. సిట్ విచారణకు కూడా హాజరవుతారని.. బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.