Telangan News :   అయ్యప్ప స్వామిపై బైరి నరేష్ అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలతో  తెలంగాణ వ్యాప్తంగా  మాల ధారణ చేసుకున్న భక్తులు ఆగ్రహానికి గురయ్యారు. రెండు రోజుల క్రితం అయ్యప్ప స్వామిపై భైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. మాలధారులు అతడికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. నరేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వికారాబాద్‌లో స్వాములు ప్రదర్శన నిర్వహిస్తూండగా. బైరి నరేష్ అనుచరుడు ఒకరు వీడియో తీశారు. అదే సమయంలో బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా స్వాములతో వాదనకు దిగారు. దీంతో స్వాములు కోపోద్రిక్తులై అతనిపై దాడి చేశారు. పోలీసులు అతన్ని విడిపించి.. స్టేషన్‌కు తరలించారు. 


మరో వైపు బైరీ నరేష్ పై పోలీసులు కేసు నమోదు  చేశారు. మత విద్వేషాలను ఉపేక్షించేది లేదని..  వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ప్రకటించారు.  అయ్యప్ప స్వామిపై అనుచిత వాఖ్యలు సబబు కాదు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడినా, ఇతరుల మనోభావాలకు ఇబ్బంది కలిగే విధంగా మాట్లాడిన లేదా ప్రవర్తించినా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  బైరీ నరేష్ కు చట్ట ప్రకారం శిక్ష పడేటట్లు చూస్తామమని ఎస్పీ ప్రకటించారు FIR No. 185/2022 U/s 153-A, 295-A, 298, 505(2) IPC of PS Kodangal సెక్షన్ల కింద కేసులు పెట్టామన్నారు. ఎక్కడైనా మీటింగ్ లు నిర్వహించేటప్పుడు మీటింగ్ నిర్వాహకులు  ఇలాంటి వారిని ప్రోత్సహించకూడదని ఎస్పీ పిలుపునిచ్చారు. అలాంటి వారిని ప్రోత్సహించి శాంతికి విఘతం కలుగ చేసిన నిర్వాహకులపైన కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  


బైరి నరేష్ ను పోలీసులు అదుపులో ఉన్నారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. కోసిగిలో అయ్యప్ప స్వాములు దాడి చేసింది బైరి నరేష్ పై అన్న ప్రచారం జరిగింది కానీ.. బైరి నరేష్ పై కాదని.. పోలీసులు చెబుతున్నారు. ఆయన అనుచరుడిపై దాడి జరిగిదంని అంటున్నారు. బైరి నరేష్ పోలీసుల అదుపులో ఉన్నారా లేదా అన్నదానిపై స్పష్టత ఇవ్వడం లేదు. అయ్యప్ప స్వాములు తీవ్ర ఆగ్రహంతో  ఉన్నందున.. బైరి నరేష్ విషయంలో పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


మరో వైరు తెలంగాణ వ్యాప్తంగా బైరి నరేష్ పై బీజేపీ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు.  హిందూ దేవి దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్ అనే వ్యక్తిపై పాతబస్తీ చార్మినార్ పోలీస్ స్టేషన్లో బీజేపీ మహిళ నేతల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. .తక్షణమే సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ  హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసిన నరేష్ ని తక్షణమే అరెస్టు చేయాలని లేనియెడల జరగబోయే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈ అంశంపై  స్పందించారు. హిందూ దేవుళ్లను అవమానించిన మునావర్ ఫారుఖీకి భద్రత కల్పించారని.. ఇప్పుడు బైరి  నరేష్ ను కాపాడుతున్నారని ఆరోపించారు.