Telangana News :  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లు పూర్తయ్యాయి.  దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌ తీరంలో తెలంగాణ సర్కార్‌ నిర్మించింది. శుక్రవారం  ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విగ్రహావిష్కరణ అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఈ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. అంబేద్కర్‌ విగ్రహం దిగువన ప్రాంగణంలో తుదిదశ పనులు కొనసాగుతున్నాయి. తుది పనులు పూర్తి చేసి ఆ తర్వాత అలంకరణ పనులు చేపట్టనున్నారు. పక్కనే బహిరంగ సభకు కూడా ఏర్పాట్లు చేశారు. 


అంబేద్కర్‌ జయంతి సందర్భంగా రాజధాని నగరంలో విగ్రహావిష్కరణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 14న మధ్యాహ్నం మూడు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలంటూ హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్న అఖిల భారత సర్వీస్‌ అధికారులందరినీ తెలంగాణ సర్కార్‌ ఆదేశించింది.  దేశంలోనే ఎత్తయిన అంబేద్కర్‌ విగ్రహం నిర్మాణం పూర్తయ్యింది. భారతావనికే తలమానికంగా నిలిచే ఈ నిర్మాణానికి ప్రత్యేకత సంతరించుకుంది. 


భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌ టాంక్‌బండ్‌ సమీపంలో 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు- సీఎం 2016లో ప్రకటించారు. దానికి అనుగుణంగా 2016 ఏప్రిల్‌ 14న ఎన్టీఆర్‌ పార్కు పక్కన 11.4 ఎకరాల విస్తీర్ణంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి భూమి పూజ కూడా చేశారు.   2017లో అప్పటి డిప్యూటీ- సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేల బృందం చైనాలో పర్యటించింది.  పార్లమెంటు ఆకృతిలో నిర్మిస్తున్న బేస్‌మెంట్‌కు ఆగ్రా, నోయిడా, జైపూర్‌ తదితర ప్రాంతాల నుంచి తెప్పించిన ఎరుపు, గోధుమ రంగుల రాళ్లను ఉపయోగించారు.                                                          


విగ్రహంలోని బూట్లు  కాళ్లు, చేతులు, భారత రాజ్యాంగం పుస్తకం, భుజాలు, ముందుకు చూపుతున్నట్లు  ఉండే కుడిచేయి, తల తదితరాలన్నిం టినీ విడివిడి భాగాలుగా నోయిడాలో కంచుతో తయారుచేసి లారీల ద్వారా తరలించారు. విగ్రహం పటిష్టంగా ఉండేందుకు లోపలివైపు స్టీల్‌ స్ట్రక్చర్‌ను ఉపయోగించారు.  విడివిడి భాగాల మొత్తం అమరిక పూర్తయిన తర్వాత పాలీ యూరేథీన్‌ కెమికల్స్‌తో  పాలిషింగ్‌ చేశారు.  టాంక్‌బండ్‌ నీటి కాలుష్యంతో పాటు గాలిలోని రసాయనాల, వాతావరణ మార్పులతో విగ్రహం షైనింగ్‌ తగ్గకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. అతి భారీ తుపానులను కూడా తట్టుకునేలా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.