Money Money More Money :  హైదరాబాద్‌లో ప్రతీ రోజూ రూ. కోట్లలో నగదు పట్టుబడుతోంది. హవాలా వ్యాపారులు పూర్తి స్థాయిలో యాక్టివ్ అయ్యారో పోలీసులే కొత్తగా సోదాలు ప్రారంభించారో కానీ పెద్ద ఎత్తున నగదు హవాలా రూపంలో తరలి పోతోంది. ఇందులో దొరుకుతోంది మాత్రమే తెలుస్తోంది.. ఎంతెంత తరలి పోతోందో మాత్రం ఎవరికీ తెలియడం లేదు. మంగళవారం గాంధీనగర్‌లో పోలీసులు తనిఖీ చేయడంతో అక్రమంగా తరలిస్తున్న రూ. 3.5కోట్ల హవాలా మనీ దొరికింది. మొత్తంగా మూడ్రోజుల వ్యవధిలోనే సుమారు ఏడు కోట్ల రూపాయలకుపైగా స్వాధీనం చేసుకున్నారు అధికారులు.ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుందన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. 


మునుగోడులో డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తున్న పార్టీలు 


ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక జరుగుతోంది . ఈ ఉపఎన్నికలో అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ సాగుతూండటంతో పెద్ద ఎత్తున పార్టీలు ప్రచారానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. అదే సమయంలో ఓటర్లకు పెద్ద ఎత్తున తాయిలాలు ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పట్టుబడుతున్న డబ్బు అంతా మునుగోడుకే వెళ్తుందని చెబుతున్నారు. ఈ అంశంపై పోలీసులకు పక్కా సమాచారం రావడంతోనే సోదాలు చేసి నగదును పట్టుకుంటున్నారని చెబుతున్నారు. 


ఎన్నికల సమయంలో ఫుల్ యాక్టివ్‌గా హవాలా వ్యాపారులు


సాధారణంగా ఎన్నికలు వస్తే హవాలా వ్యాపారులకు పండగే. కమిషన్లు తీసుకుని ఎంత కావాలంటే అంత నగదును కావాల్సిన చోటకు తరలిస్తారు. బ్లాక్ మనీని సర్క్యూలేట్ చేయడంలో హవాలా ఆపరేటర్లు చేయి తిరిగి ఉంటారు. వారంతా హైదరాబాద్ కేంద్రంగానే ఉంటారు. అందుకే ఎక్కడ ఎన్నిక జరిగినా నగదు హైదరాబాద్ నుంచే సరఫరా అవుతుందని రాజకీయ వర్గాలు చెబుతూంటాయి. ఈ క్రమంలో పట్టుబడుతున్న డబ్బు అంతా అక్కడికే వెళ్తుందని చెబుతున్నారు. అయితే ఈ డబ్బు ఎవరిది? ఎవరి కోసం పంపిస్తున్నారు ? అసలు ఎవరు పంపిస్తున్నారన్న వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు తంటాలు పడుతున్నారు. సాధారణంగా డబ్బును రవాణా చేసే వారికి పూర్తి వివరాలు తెలియదు. ఓ రకంగా చెప్పాలంటే వారు తీసుకెళ్తున్న బ్యాగుల్లో డబ్బులు ఉన్నాయని కూడా తెలియదు. సినిమాల తరహాలో ఎవరికి అందించాలో అందించేందుకు మాత్రమే వారుంటారు. 


పట్టుబడుతున్న డబ్బంతా ఒకే పార్టీదా ?


అయితే పోలీసులకు అన్నీ తెలుసని..  అన్ని పార్టీలకు చెందిన నగదును పట్టుకోరని..ఓ పార్టీ తరలిస్తున్న డబ్బును అసలు ఆపరని.. మరికొన్ని పార్టీలు పంపే డబ్బును మాత్రం నిఘా వేసి మరీ పట్టుకుంటారని అంటున్నారు. గతంలో దుబ్బాక, హుజూరాబాద్ వంటి ఉపఎన్నికల్లో అదే జరిగింది. దుబ్బాక సమయంలో బీజేపీ అభ్యర్థికి చెందిన డబ్బు పదే పదే పట్టుబడింది. ఫోన్లు ట్యాప్ చేశారని రఘునందన్ ఆరోపించారు. ఇప్పుడూ బీజేపీ అభ్యర్థికి చెందిన సొమ్మే ఎక్కువగా పట్టుబడుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 


బీజేపీ ఆ పని చేస్తే మునుగోడులో పోటీ చెయ్యం! చంద్రబాబు, వైఎస్సే నయం - కేటీఆర్