AMGEN To Open New Site In Hyderabad : అమెరికాలో పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆమ్ జాన్ కంపెనీతో పెట్టుబడుల ఒప్పందం చేసుకున్నారు. ఆ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగంతో ముందుగా రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆమ్జెన్ ఆర్ అండ్ డీ కేంద్రంలో డాక్టర్ డేవిడ్ రీస్ మరియు మిస్టర్ సోమ్ చటోపాధ్యాయతో సమావేశమయ్యారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలన్న సీఎం, మంత్రి అభ్యర్థనకు కంపెనీ ప్రతినిధులు అంగీకారం తెలిపారు.
తర్వాత ఆమ్జెన్ హైదరాబాద్ లో టెక్నాలజీ, ఇన్నేవేషన్ సెంటర్ ను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. మెడిసిన్, లైఫ్ సైన్సెస్, డేటా సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో ప్రపంచ స్థాయి కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్టు ఆమ్జెన్ తెలిపింది. ఆమ్జెన్ సంస్థ 3 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఆమ్జెన్ 40 ఏళ్ల నుంచి నుంచి బయోటెక్నాలజీ రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. హైటెక్ సిటీలో ఆరు అంతస్తుల్లో ఆమ్జెన్ ఇండియాను ఏర్పాటు చేయనున్నారు. మెడిసిన్, లైఫ్ సైన్సెస్, డేటా సైన్సెస్, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో పరిశోధనలు చేసేలా ఈ ఏడాది చివరి కల్లా ప్రారంభించనున్నారు.
బయోటెక్నాలజీ రంగంలో ప్రపంచ స్థాయి కంపెనీ హైదరాబాద్కు రావడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ పరిణామం తెలంగాణలో మనం పెంచుతున్న ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ కు బలమైన మద్దతుగా నిలుస్తుందన్నారు. ఆమ్జెన్ తో భాగస్వామ్యంతో వారికి కావాల్సిన పూర్తి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆమ్జెన్ కు దాదాపు 27,000 మంది ఉద్యోగులు ఉన్నారు. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 దేశాల్ల ఆమ్జెన్ కార్యకలాపాలు ఉన్నాయి.
అంతకు ముందు కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్ ను రేవంత్ బృందం సందర్శించింది.