Bangladesh Crisis Updates: బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాకి వచ్చిన షేక్ హసీనా మళ్లీ బంగ్లాదేశ్‌కి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆమె కొడుకు ఓ ప్రకటన చేశారు. కొత్త ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా అప్పుడు బంగ్లాదేశ్‌కి వెళ్తామని వెల్లడించారు. దాదాపు నెల రోజులుగా బంగ్లాదేశ్‌ అట్టుడుకుతోంది. రిజర్వేషన్‌లలో కోటాపై అక్కడి యువత ప్రభుత్వంపై తిరగబడింది. ఈ అల్లర్లు హింసాత్మకంగా మారాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితులు అదుపు తప్పాయని గ్రహించిన షేక్ హసీనా వెంటనే బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి వచ్చేశారు. ఆ వెంటనే అక్కడ పార్లమెంట్ రద్దైంది. ఆపద్ధర్మ ప్రధానిగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటికే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. 


అయితే..ఈ పరిణామాల మధ్య షేక్ హసీనా కొడుకు సాజీబ్ వాజీద్ జాయ్‌ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ప్రస్తుతానికి పరిస్థితులు బాగోలేక ఆమె ఇండియాలో ఉన్నారని, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే బంగ్లాదేశ్‌కి వెళ్లిపోతారని తేల్చి చెప్పారు సాజీబ్. అయితే...ఆమె బంగ్లాదేశ్‌కి వెళ్లే అక్కడి ఆందోళనకారులు ఊరుకుంటారా లేదా అన్నదే అంతు తేలని ప్రశ్న. ఆమె పేరు చెబితేనే రగిలిపోతున్నారంతా. పైగా ఆమె తండ్రి రెహమాన్ విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. నియంతలా పరిపాలించారంటూ తీవ్రంగా మండి పడుతున్నారు. 


ప్రస్తుత ఆపద్ధర్మ ప్రభుత్వంలో షేక్ హసీనా పార్టీ ఆవామీ లీగ్ ప్రాతినిధ్యమే లేదు. పూర్తిగా ఈ పార్టీని తప్పించేయాలని భావిస్తున్నాయి ప్రతిపక్షాలు. పైగా జమాతే ఇస్లామీ పార్టీ కూడా అక్కడి ఆందోళనకారుల్ని రెచ్చగొడుతోంది. హిందువులపైనా దాడులు జరుగుతున్నాయి. ఈ అల్లర్ల కారణంగా 300 మంది చనిపోయారు. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. అసలు పరిస్థితులు ఎప్పుడు అదుపులోకి వస్తాయో కూడా తెలియడం లేదు. కొత్త ప్రభుత్వానికి ఇదే సవాల్ కానుంది. ప్రస్తుతానికి ఢిల్లీలోని ఓ ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నారు షేక్ హసీనా. మోదీ సర్కార్ మాత్రం ఆమెకి పూర్తిగా ఆశ్రయం ఇచ్చేందుకు అంగీకరించలేదు. ఫలితంగా ఆమె ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. యూకేకి వెళ్దామని అనుకున్నా ఆ దేశం ఆంక్షలు విధించింది. (Also Read: Manish Sisodia: లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియాకి సుప్రీంకోర్టు బెయిల్, 17 నెలల తరవాత ఊరట)


అమెరికా అయితే ఏకంగా ఆమె వీసాని రద్దు చేసింది. ఇప్పటికి తాత్కాలికంగా ఇండియాలో తలదాచుకున్న షేక్ హసీనా ఎప్పుడైనా ఇక్కడి నుంచి వెళ్లిపోక తప్పేలా లేదు. ఈ విషయమై భారత్, బంగ్లాదేశ్ మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆమెని అరెస్ట్ చేయాలంటూ బంగ్లాదేశ్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. కానీ ఆమె కొడుకు మాత్రం ఎన్నికల గురించి ప్రస్తావించడం మరింత ఆందోళనకరంగా మారింది. పైగా వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని చాలా ధీమాగా చెబుతున్నారు. ఇది ఆందోళనకారుల్లో ఇంకాస్త ఆగ్రహం పెంచేలా కనిపిస్తోంది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత్ ఆమెకి ఆశ్రయం ఇచ్చేందుకు వెనకాడుతోంది. త్వరలోనే ఆమె ఏదో ఓ నిర్ణయం తీసుకుని ఇండియా నుంచి వెళ్లిపోతారని సమాచారం. 


Also Read: Supreme Court: సుప్రీంకోర్టులో లాపతా లేడీస్ సినిమా ప్రదర్శన, ఆమీర్ ఖాన్ సమక్షంలో మూవీ చూడనున్న సీజేఐ