kavitha Vs Revant :  తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల వేడి అంతకంతకూ పెరుగుతోంది. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.  తాజాగా బెంగళూరులో డీకే శివకుమార్ తో రేవంత్   రెడ్డి సమావేశం అయ్యారు. ఆ ఫోటోను ట్వీట్ చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత .. తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీ వయా బెంగళూరు అని అర్థం వచ్చేలా పోస్ట్ చేశారు.  కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఢిల్లీకి గులామలేనని ఈ సారి కూడా అంతే కానీ కొత్తగా బెంగళూరు బాస్ వచ్చారన్నట్లుగా కవిత ఆ పోస్ట్ చేశారు.

  





 వెంటనే రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి నమస్కరిస్తున్న ఫోటోపెట్టి కౌంటర్ ఇచ్చారు. ఇది కేసీఆర్ మ్యాజిక్కు.. జగమెరిగిన 'నిక్కర్'...లిక్కర్... లాజిక్కు అని విమర్శలు గుప్పించారు. 


 







తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలు, ఇతర వ్యూహాల విషయంలో  డీకే శివకుమార్ కీలక  పాత్ర పోషిస్తున్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.  తెలంగాణలో గెలుపు కోసం ప్రియాంకా గాంధీ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలో కర్ణాటకలో గెలపు అందించిన డీకే శివకుమార్ కు తెలంగాణ విషయంలోనూ బాధ్యతలిచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో రేవంత్ రెడ్డి తరచూ శివకుమార్ తో సమావేశం అవుతున్నారు. తాజాగా పార్టీలో మరికొన్ని చేరికలకు గ్రీన్ సిగ్నల్ కోసం ఆయన బెంగళూరు వెళ్లి శివకుమార్ తో సమావేశమైనట్లుగా తెలుస్తోంది. తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మరికొంత మంది పార్టీలో చేరనున్నారు. అలాగే టిక్కెట్ల ఖరారుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నారు. వీటన్నింటిపై చర్చించేందుకు రేవంత్ బెంగళూరు వెళ్లినట్లుగా తెలుస్తోంది.                                          


అయితే తెలంగాణ రాజకీయాలు ఇలా ఢిల్లీ ప్రతినిధుల ముందు పెట్టి .. ఆత్మ గౌరవానికి  భంగం కలిస్తున్నారని భారత రాష్ట్ర సమితి ఆరోపణ. బీఆర్ఎఎస్ హైకమాండ్ ప్రజలేనని.. మాకు ఢిల్లీలో ఎలాంటి బాసులు లేరని వారు చెబుతూ ఉంటారు. అయితే.. కేసీఆర్ ఢిల్లీ బాసులకు ఎలా వంగి వంగి  నమస్కారాలు చేస్తారో చూడండంటూ రేవంత్ రెడ్డి ఫోటోలు విడుదల చేస్తున్నారు. ఢిల్లీలో పోరాటం అంటారు.. ఢిల్లీలో మాత్రం కలిసిపోతారని ఆయన తరచూ  విమర్శిస్తూంటారు.  బీఆర్ఎస్,  బీజేపీ వేర్వేరు కాదని.. రెండు పార్టీలు ఒకటేనని ఆయన ఉద్దేశం.