Telangana budget 2023 :  తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టబోతోంది. గత ఏడాది కంటే భారీగా పద్దులు ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఖర్చులు సరే.. మరి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది..? ఈ సందేహం అందరికీ వస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ సారి ప్రజాకర్షక పథకాలను పెంచేందుకు ప్రజలపై  ఓ మోస్తరుగా పన్నులు పెంచడంతో పాటు భూముల అమ్మి ఎక్కువగా నిధులు సమీకరించుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. 


కేంద్రం నుంచి వచ్చే నిధులు - అప్పుల పరిమితిపై ఆశలు లేనట్లే !


కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పన్నుల్లో తెలంగాణ వాటా   2.10 శాతం. ఈ ప్రకారం రూ.21,470 కోట్లు తెలంగాణకు వస్తాయి. వీటికి కేంద్ర ప్రభుత్వ పథకాలు.. ఇతర గ్రాంట్స్ కూడా కలిపి రాష్ట్రానికి రూ.38 వేల కోట్లు మాత్రమే  అందనున్నాయి. అప్పుల పరిమితిపై కూడా కేంద్రం నియంత్రణ విధించనుంది. ఈ ఏడాది కార్పొరేషన్ల పేరుతో చేసిన అప్పులను కూడా పరిగణనలోకి తీసుకుని వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిబంధనల ప్రకారం రావాల్సిన అప్పులను కూడా నియంత్రించడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే.. బడ్జెట్‌లో ఎంత మేర అప్పులను లక్ష్యంగా పెట్టుకున్నా.. వాటి లక్ష్యం మేర బహిరంగ మార్కెట్ రుణాలను సాధించుకోవడం అంత తేలిక కాదు. 


స్వల్పంగా వివిధ రకాల పన్నుల పెంపు ఉండే చాన్స్ ! 


తెలంగాణ ప్రభుత్వ ఆదాయం  పెంపునకు రకరకాల మార్గాలను అన్వేషించినట్లుగా తెలుస్తోంది. అందులో ఇసుక లాంటి వాటి ధరల పెంపు దగ్గర్నుంచి చాలా మార్గాలను రెడీ చేసుకుంది. వరదల కారణంగా వాగులు, వంకలు, ప్రాజెక్టులు, నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక భారీగా పేరుకుపోయింది. దీంతో కొత్తగా ఇసుక రీచ్‌ల వేలం, రాయల్టి పెంచే అవకాశం ఉంది. గతంలో భూములు, ఇండ్లు, ప్లాట్ల మార్కెట్‌ విలువలను రెండేళ్లకు పట్టణాల్లో, మూడేళ్ల కోసారి గ్రామీణ ప్రాంతాల్లో సవరించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ఇటీవలే సవ రించింది. ఎప్పుడైనా మార్కెట్‌ విలువలను పెంచుకునేందుకు వీలుగా ఈ నిర్ణ యం తీసుకోగా మరోసారి మార్కెట్‌ విలువల సవరణకు ఉన్న అవకాశాలను, సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు. తాజాగా స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖలో ఎల్‌ఆర్‌ఎస్‌లేని, అనుమతిలేని లే అవుట్ల ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిల్చిపోవడం, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో రాబడి తగ్గిపోవడంతో దీనిపై పున: సమీక్ష చేసి ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది. 


భూముల అమ్మకంపై ఎక్కువ ఆశలు ! 


హైదరాబాద్ శివార్లలో భూములను వేలం వేసి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు సమీకరించుకుంది.  ఈ సారి జిల్లాల్లో కూడా భూములు వేలం వేయాలన్న ఆలోచన చేస్తోంది.  నిరుపయోగ భూములు 32 జిల్లాల్లో గుర్తిం చిన వివరాల సేకరణ, అమ్మకం, రాజీవ్‌ స్వగృహ ఇండ్లు, కార్పొ రేషన్‌ పరిధిలోని భూముల అమ్మకం, దిల్‌కు సంబంధించిన భూములపై ఉన్న కేసును పరిష్కరించుకుని వీటి విక్రయాలు నిర్వహించి ఆదాయాన్ని పొందే అవకాశం ఉందని తెలుస్తోంది.  తెలిసింది. అదేవిధంగా పలు శాఖల్లో పేరుకుపోయిన బకాయిలు, వన్‌టైం సెటిల్‌మెంట్లకు ఉన్న అవకాశాలు, కేంద్రం వద్ద ఉన్న బకాయిలను వసూలు చేసుకునే అవకాశాలతో బడ్జెట్‌లో అంచనాలను ప్రతిపాదించనున్నట్లుగా తెలుస్తోంది.