Independence Day Celebrations: పంద్రాగస్టు వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట ముస్తాబవుతోంది. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి ఈ ఏడాదితో 75 ఏళ్లు పూర్తవుతున్న వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు కేంద్ర ప్రభుత్వం 1800 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించింది.


పీఎం-కిసాన్‌ పథకం లబ్ధిదారులు సహా మొత్తం 1800 మంది ప్రత్యేక అతిథులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి ఈ ఏడాదితో 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశంలోని పలు రంగాలకు చెందిన వారిని కేంద్రం ప్రత్యేకంగా ఆహ్వానించింది. సర్పంచులు, ఉపాధ్యాయులు, నర్సులు, రైతులు, మత్స్యకారులు, కార్మికులు, ఖాదీరంగ శ్రామికులు సహా అనే రంగాలవారిని ఆహ్వానించామని కేంద్ర వ్యవసాయ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 


కొత్త పార్లమెంటును నిర్మించిన కూలీలు, జాతీయ అవార్డు పొందిన పాఠశాల ఉపాధ్యాయులు, సరిహద్దు రోడ్ల సంస్థ కార్మికులు, అమృత్‌ సరోవర్, హర్‌ ఘర్‌ జల్‌ యోజన ప్రాజెక్ట్‌ల కోసం సహాయం చేసినవారు, పనిచేసినవారు, పీఎం-కిసాన్‌ యోజన లబ్ధిదారులు 50 ఈ ప్రత్యేక ఆహ్వనితుల జాబితాలో ఉన్నారు. వీరంతా ఎర్రకోట వద్ద జెండా వందనంలో పాల్గొంటారు. 


ఢిల్లీ ఎర్రకోటలో జరిగే ఈ వేడుకలకు తెలంగాణాకు చెందిన పలువురు సామాన్యులకు అవకాశం దక్కింది. కరీంనగర్‌లోని రైతుప్రగతి రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం ప్రైవేట్‌ లిమిటెడ్‌ లబ్ధిదారులు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లోని భూసంపాడు ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ లిమిటెడ్‌తోపాటు హైదరాబాద్‌లోని సెంట్రల్‌ ఫిషర్మెన్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు.


ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం రావడంపై కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటకు చెందిన వ్యవసాయదారుల ఉత్పత్తి సంఘం చైర్మన్‌ సంద మహేందర్, ఆదిలాబాద్‌ జిల్లా గుండాలకు చెందిన భూసంపద రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌ చైర్మన్‌ జూన గణపతిరావు, సెంట్రల్‌ ఫిషర్మెన్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ జాతీయ అధ్యక్షుడు జనార్దన్‌ గంగపుత్ర సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి అవకాశం వస్తుందని అనుకోలేదన్నారు.


ఏపీ నుంచి శ్రీకాకుళం వాసులకు అవకాశం


శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన కార్మికులు స్వాతంత్య్రదిన వేడుకల్లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు. ఇద్దరు నేతలన్నలకు ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. పొందూరకు చెందిన 50 ఏళ్ల బల్ల భద్రయ్యకు, జల్లేపల్లి సూర్యకాంతానికి ఆహ్వానం అందింది. 35 ఏళ్ల నుంచి నేత పని చేస్తున్న భద్రయ్య 100 కౌంటర్‌ బంగారు అంచు కలిగిన పంచెలు నేయడంలో దిట్ట. సూర్యాకాంతం దారం తీయడంలో మంచి పనిమంతురాలు. భద్రయ్య తన భార్య లక్ష్మి, సూర్యకాంతం ముగ్గురు కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. వీళ్ల ముగ్గురు ఎర్రకోటలో జరిగే వేడుకకు ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు. మాజీ ప్రధానులు, ఇతర దేశాల ప్రతినిధులు కూర్చునే చోట వీరికి సీట్లు కేటాయించారు.


10 వేల మందితో భద్రత
స్వాతంత్య్ర దిన వేడుక‌ల‌కు ఎర్రకోట ముస్తాబవుతోంది. ర‌క‌ర‌కాల పూల‌తో ఆ ప్రాంతాన్ని సుందరంగా అలంక‌రిస్తున్నారు. ప్రధాని న‌రేంద్ర మోదీ ఆధ్వర్యంలో జ‌రిగే ఈ వేడుక‌ల‌కు 10 వేల మంది పోలీసుల‌తో ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 1000 సీసీ కెమెరాల‌తో నిఘా ఏర్పాటు చేశారు. స‌మ‌స్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచి అనుమానితులు ప్రతి ఒక్కరి క‌ద‌లిక‌ల‌ను క్షుణ్ణంగా గ‌మ‌నిస్తున్నారు. ఈ ఏడాది 20 వేల‌కు పైగా అధికారులు, పౌరులు ఈ వేడుక‌ల్లో పాల్గొన‌నున్నారు. రాజ్‌ఘాట్‌, ఐటీవో, రెడ్ ఫోర్ట్‌తో పాటు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.