విమాన ప్రయాణ సమయంలో ప్రయాణీలు కొన్ని నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాంటి వాటిలో మొదటిది సెల్ ఫోన్ ను స్విచ్ఛాప్ చేయడం. లేదంటే ఫైట్ మోడ్ లో పెట్టడం. ఇంతకీ ఫ్లైట్ మోడ్ అంటే ఏంటి? ఫ్లైట్ మోడ్ ఏం పని చేస్తుంది? విమాన ప్రయాణంలో ఫోన్ ను ఫ్లైట్ మోడ్ లో ఎందుకు పెట్టాలి? పెట్టకపోతే ఏం జరుగుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


సెల్ ఫోన్ ను ఫ్లైట్ మోడ్‌ కి మార్చడం వల్ల సెల్ టవర్లతో కమ్యూనికేషన్ ను కోల్పోతుంది. Wi-Fiకి కనెక్ట్ కాకుండా ఆపుతుంది. బ్లూ టూత్‌ ను సైతం పని చేయనివ్వదు. నిజానికి  ఫోన్ ఫ్లైట్ మోడ్ లో ఉన్నా బ్లూ టూత్, వైఫైని తిరిగి ఆన్ చేసే అవకాశం ఉంటుంది. కానీ, వాటిని విడిగా ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, విమాన ప్రయాణంలో వాటిని కూడా ఉపయోగించకూడదు.  విమాన ప్రయాణాలు మొదలైన తొలి రోజుల్లో ఫోన్ల వల్ల విమానంలోని ఎలక్ట్రానిక్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోయేదట. అందుకే విమాన ప్రయాణంలో ఫోన్లను ఆఫ్ చేయాలనే నిబంధనను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విమానాల సాంకేతిక వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది. విమానంలో ఫోన్ వాడడం వలన ఇప్పటి వరకు ఏ విమానం కూడా ప్రమాదానికి గురికాలేదు. అయినా, ఫ్లైట్ జర్నీలో మోబైల్ వాడకంపై నిషేధం కొనసాగుతోంది.


ఫ్లైట్ జర్నీలో ఫోన్లు ఎందుకు ఆఫ్‌ చేయాలంటే?


విమానంలో ఫోన్ వాడటం మూలంగా ఫ్లైట్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వ్యవస్థలకు పెద్దగా ఇబ్బందులు రావు. కానీ, పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో మాట్లాడే సమయంలో కొంత  నాయిస్ కలిగిస్తాయట. వెదర్ కండీషన్ సరిగా లేని సమయంలో వాయిస్ క్లారిటీగా రాకుండా అడ్డుపడతాయట. ఏటీసీ సందేశాలు స్పష్టంగా వినిపించక పైలట్లకు ఇబ్బంది కలుగుతుందట. అందుకే ల్యాండింగ్, టేక్ ఆఫ్ సమయంలో మొబైల్ ఫోన్లను ఆఫ్‌ చేయమని విమాన సిబ్బంది ప్రయాణీకులకు సూచిస్తారు.   


సెల్ ఫోన్ల కారణంగా విమాన ప్రమాదాలు జరిగాయా?


సెల్ ఫోన్ సిగ్నల్ మూలంగా విమానంలోని పరికరాలు, సెన్సార్లు, నావిగేషన్, అనేక ఇతర ముఖ్యమైన వ్యవస్థలు ప్రభావితం అవుతాయట. ఒక్కోసారి పైలెట్లు ఈ సిగ్నల్స్ మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉందట. అందుకే వీటి నుంచి తప్పించుకునేందుకు ఫోన్‌ను ఏరో ప్లేన్ మోడ్‌లో ఉంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల విమాన ప్రమాదాలను తగ్గించే అవకాశం ఉందంటున్నారు. 2000లో స్విట్జర్లాండ్, 2003లో న్యూజిలాండ్‌లో జరిగిన విమాన ప్రమాదాలకు మొబైల్ ఫోన్ వాడకమే కారణమని భావిస్తున్నారు. 


విమాన ప్రయాణాల్లో ఫోన్ల వినియోగంపై కఠిన ఆంక్షలు


పలు దేశాలు విమాన ప్రయాణాల్లో ఫోన్ల వినియోగంపై కఠిన నిబంధనలు పెట్టాయి. విమానంలో ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేయకపోతే ఫైన్ తో పాటు జైలు శిక్ష విధిస్తుంది చైనా ప్రభుత్వం. పలు ప్రపంచ దేశాలు సైతం విమానంలో సెల్ ఫోన్ల వినియోగం మీద ఆంక్షలను పెట్టాయి.  


Read Also: మీ ఆధార్ వివరాలను WhatsApp, Gmail ద్వారా పంచుకుంటున్నారా? అయితే, ఈ ముప్పు తప్పదు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial