సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే వాట్సాప్, మరో అదిరిపోయే ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. బిజినెస్ అవసరాలకు ఉపయోగపడేలా ‘స్టేటస్ ఆర్కైవ్’ అనే పేరుతో కొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. అయితే, ఈ ఫీచర్ కేవలం బిజినెస్ యాప్ కు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఫీచర్ ద్వారా వ్యాపార నిర్వాహకులు, వినియోగదారుల మధ్య సంబంధాలను మరింత మెరుగుపరిచే అవకాశం ఉందని వాట్సాప్ వెల్లడించింది. ఈ నూతన ఫీచర్ ను ఆండ్రాయిడ్ బిజినెస్ యాప్ బీటా వినియోగదారులతో టెస్ట్ చేస్తున్నట్లు తెలిపింది. త్వరలోనే ఈ ఫీచర్ ను బిజినెస్ యాప్ వినియోగదారులందరికీ అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది.


ఇకపై వాట్సాప్ స్టేటస్ లను ఆర్కైవ్ చేసుకోవచ్చు


కొద్ది రోజుల క్రిమతే ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా వెర్షన్ లో కాల్స్ ట్యాబ్ కు సరికొత్త మార్పులు చేసింది మెటా యాజమాన్యం. అందులో భాగంగానే ఇప్పుడు ‘స్టేటస్ ఆర్కైవ్’ అనే ఫీచర్ ను పరిచయం చేసింది. ఇది వాట్సాప్ లేటెస్ట్ అప్ డేట్స్ ను ఇన్ స్టాల్ చేసిన తర్వాత కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారులు మాత్రమే ఈ కొత్త ఫీచర్ ను ఉపయోగించగలుగుతున్నారు. వాట్సాప్ ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేసిన తర్వాత, ఈ ఫీచర్ యాక్టివ్ గా ఉన్నట్లు స్టేటస్ ట్యాబ్ బ్యానర్ వినియోగదారులకు సూచిస్తుందని తెలిపింది.  


బిజినెస్ యాప్ వినియోగదారులకు మాత్రమే!


వాస్తవానికి వినియోగదారులు పెట్టే స్టేటస్ 24 గంటల తర్వాత మాయం అవుతుంది. అయితే, ఈ కొత్త ఫీచర్ కారణంగా 24 గంటల గడువు ముగిసిన తర్వాత సదరు స్టేటస్ లు ఆటోమేటిక్ గా ఆర్కైవ్ అవుతాయి. బిజినెస్ యాప్ వినియోగదారులు ఆయాన ఆర్కైవ్ స్టేటస్ లను అవసరం ఉన్న సమయంలో మళ్లీ పెట్టుకునే అవకాశం ఉంటుంది. స్టేటస్‌ ట్యాబ్‌లోని మెనూ నుంచి ఆర్కైవ్ చేసిన స్టేటస్‌ ను చూసే అవకాశం ఉంటుంది. అయితే, ఈ ఆర్కైవ్ స్టేటస్ లు ప్రైవేటుగానే ఉంటాయి. బిజినెస్ యాప్ వినియోగదారులు మాత్రమే ‘స్టేటస్ ఆర్కైవ్’ను పొందే అవకాశం ఉంటుంది.   


నెల రోజుల పాటు అందుబాటులో ఆర్కైవ్ స్టేటస్ లు


ఈ ఫీచర్ సాయంతో అవసరం ఉన్న సమయంలో ఆర్కైవ్ నుంచి స్టేటస్ లను మళ్లీ వినియోగదారులతో షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం ద్వారా వ్యాపారస్తులు తమ బిజినెస్ ను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని వాట్సాప్ వెల్లడించింది.  అయితే, ఆర్కైవ్ చేసిన స్టేటస్ లు కేవలం నెల రోజులు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఆర్కైవ్ నుంచి వెళ్లిపోతాయి.


 రీసెంట్ గా వాట్సాప్ నుంచి పలు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారులు వీడియో కాల్ మాట్లాడే సమయంలో తమ మొబైల్ స్క్రీన్ ను ఇతరులకు షేర్ చేసే అవకాశాన్ని కల్పించే ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. త్వరలో ఈ ఫీచర్ వాట్సాప్ యూజర్స్ అందరికీ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలిపింది. అటు ఎడిట్ మెసేజ్ ఫీచర్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.ఇతరులకు సెండ్ చేసిన మెసేజ్ ను 15 నిమిషాల లోపు ఎడిట్ చేసే అవకాశం ఉంటుంది. మెసేజ్ లో ఏవైనా పొరపాట్లు దొర్లితే, డిలీట్ చేసి మళ్లీ పంపాల్సిన అవసరం లేకుండా పంపిన మెసేజ్ ను ఎడిట్ చేసి పంపితే సరిపోతుంది.    


Read Also: వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్, ఇకపై మీ స్క్రీన్ ఇతరులకు షేర్ చెయ్యొచ్చు!