ట్విట్టర్ బ్లూ టిక్‌కు నగదు వసూలు చేస్తామని కంపెనీ తెలిపిన కొద్ది రోజులకే 7.99 డాలర్ల వెరిఫికేషన్ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ట్విట్టర్ కొత్తగా లాంచ్ చేసిన ఐవోఎస్ వెర్షన్‌లో ఈ సేవకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ట్విట్టర్ బ్లూ అధికారికంగా లాంచ్ కావడం ఇదే మొదటిసారి.


యాపిల్ యాప్ స్టోర్‌లోని తాజా అప్‌డేట్ ప్రకారం మైక్రోబ్లాగింగ్ సైట్‌లో వెరిఫైడ్ టిక్ పొందడానికి మీరు Twitter బ్లూ కోసం చెల్లించవలసి ఉంటుంది. "ప్రజలకు అధికారం: మీరు ఇప్పటికే ఫాలో అవుతున్న సెలబ్రిటీలు, కంపెనీలు, రాజకీయ నాయకుల మాదిరిగానే మీ ఖాతాకు బ్లూ చెక్‌మార్క్ వస్తుంది." అని ట్విట్టర్ తాజా యాపిల్ యాప్ స్టోర్ అప్‌డేట్‌లో పేర్కొంది.


iOSలో అప్‌డేట్ అయిన లేటెస్ట్ వెర్షన్ ప్రకారం Twitter బ్లూ ప్రస్తుతం US, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకేలో అందుబాటులో ఉందని స్పష్టం చేసింది. “ఈరోజు నుంచి మేం Twitter బ్లూకి గొప్ప కొత్త ఫీచర్‌లను జోడిస్తున్నాము. త్వరలో మరిన్నింటిని అందిస్తాము. మీరు ఇప్పుడు సైన్ అప్ చేస్తే నెలకి 7.99 డాలర్లకే Twitter బ్లూని పొందండి." అని iPhone కోసం Twitter యాప్‌కు అందించిన తాజా అప్‌డేట్‌లో పేర్కొంది.


ట్విట్టర్‌లో దాదాపు సగం మందికి పైగా ఉద్యోగులను తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే దాదాపు 7,500 మందికి పైగా. ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి ఎలాన్ మస్క్ దాదాపు 44 బిలియన్ డాలర్ల ఖర్చు పెట్టారు. ట్విట్టర్ చేతిలోకి రాగానే కంపెనీ టాప్ మేనేజ్‌మెంట్ మొత్తాన్ని తొలగించారు. ట్విట్టర్ ప్రస్తుతానికి నాలుగు మిలియన్ డాలర్ల నష్టంతో నడుస్తుందన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మస్క్ సమర్థించుకున్నాడు. విధుల నుంచి తొలగించిన వారికి మూడు నెలల వేతనాన్ని అందిస్తున్నట్లు తెలిపాడు.


మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం ట్విట్టర్ ఉద్యోగులకు ‘తీసివేయడం ఇప్పుడే ప్రారంభం అయింది’ ఈమెయిల్స్ కూడా వచ్చాయి. ట్విట్టర్‌లో ఉద్యోగాల కటింగ్ గురించి కూడా ఎలాన్ మస్క్ హింట్ ఇచ్చారు. ట్విట్టర్‌లో ‘తలల సంఖ్యను క్రమబద్ధీకరణ’ చేయాలని తెలిపారు. ట్విట్టర్‌లో చేయనున్న మార్పుల గురించి కూడా చర్చించాడు. కంటెంట్ మోడరేషన్ విషయంలో ట్విట్టర్ కమిట్‌మెంట్ మారబోదన్నారు.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?