యూనివర్శల్ హీరో కమల్ హాసన్ తన కెరీర్ లో రెండొందలకు పైగా సినిమాలు చేశారు. ఇటీవల ఆయన నటించిన 'విక్రమ్' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు అన్ని భాషల్లో ఈ సినిమా సత్తా చాటింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో కమల్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన 'ఇండియన్2' సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇంతలో మరో సినిమా ఒప్పుకున్నారు.


 లెజండరీ డైరెక్టర్ మణిరత్నంతో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు కమల్ హాసన్. దీనికి సంబంధించిన అధికార ప్రకటన వచ్చేసింది. వీరిద్దరూ కలిసి ఇదివరకు 'నాయకన్' అనే సినిమాను తీశారు. 1987లో ఈ సినిమా రిలీజయింది. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషన్. తెలుగులో 'నాయకుడు' అనే పేరుతో ఈ సినిమాను విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. 


దాదాపు 35 ఏళ్ల తరువాత మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. దీనికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించనున్నారు. మద్రాస్ టాకీస్, రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్లపై ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. కమల్ హాసన్ కూడా నిర్మాణంలో  భాగస్వామ్యం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించనున్నారు. కమల్ హాసన్ 234వ సినిమా ఇది. 2024లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందని ప్రకటించారు.  


Also Read : పక్కా ప్లానింగ్‌తో పవన్ అడుగులు - రాజకీయాలు, సినిమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా!


షూటింగ్ స్టేజ్ లో 'ఇండియన్2':


శంకర్ దర్శకత్వంలో 'ఇండియన్2' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కమల్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో ముందుగా రకుల్, కాజల్ లను హీరోయిన్లుగా తీసుకున్నారు. కాజల్ గర్భవతి కావడంతో ఆమె సినిమా నుంచి తప్పుకుందనే వార్తలొచ్చాయి. అయితే షూటింగ్ లో ఆలస్యం జరగడం కాజల్ కి కలిసొచ్చింది.ఇప్పుడు కాజల్ నటించడానికి సిద్ధంగా ఉండడంతో కమల్ సెట్స్ లో జాయిన్ అవ్వబోతుంది.