ప్రస్తుతం మనదేశంలో ఆన్‌లైన్ స్కాములు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటికి ఎవరూ అతీతులు కాదు. టెక్నాలజీ గురించి పూర్తిగా ఐడియా ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ కూడా ఈ ట్రాప్‌లో పడటం బాధాకర విషయం. ఇలా ఆన్‌లైన్ మోసాల బారిన పడి ఒక టెకీ రూ.42 లక్షలు పోగొట్టుకున్న ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది. వాట్సాప్‌లో పార్ట్ టైమ్ జాబ్స్ గురించి మొదట అతనికి ఒక మెసేజ్ వచ్చింది. యూట్యూబ్ వీడియోలు లైక్ చేయడం ద్వారా అదనపు ఆదాయం సంపాదించవచ్చని ఈ మెసేజ్‌లో పేర్కొన్నారు.


పీటీఐ కథనం ప్రకారం... బాధిత వ్యక్తి గురుగ్రాం సెక్టార్ 102లో ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. మార్చి 24వ తేదీన అతనికి వాట్సాప్‌లో ఒక పార్ట్ టైం జాబ్‌కు సంబంధించిన మెసేజ్ వచ్చింది. యూట్యూబ్‌లో వీడియోలు లైక్ చేసి అదనపు మొత్తాన్ని సంపాదించుకోవచ్చని అందులో పేర్కొన్నారు. దానికి అంగీకరించిన తర్వాత దివ్య అనే పేరున్న ఒక టెలిగ్రాం గ్రూపులో అతన్ని యాడ్ చేశారు. ఆ గ్రూపులో చేరిన తర్వాత కమల్, అంకిత్, భూమి, హర్ష్ అనే పేర్లున్న గ్రూపు సభ్యులు కచ్చితంగా డబ్బులు వస్తాయని చెప్పి అతనితో ఇన్వెస్ట్ చేయించారు.


వారి మాటలకు పడిపోయిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్... తన బ్యాంకు ఖాతా, తన భార్య బ్యాంకు ఖాతా నుంచి రూ.42,31,600లను వారికి ట్రాన్స్‌ఫర్ చేశారు. ‘నేను వారితో పని చేయడానికి అంగీకరించినప్పుడు దివ్య అనే మహిళ నన్ను ఒక టెలిగ్రామ్ గ్రూపులో యాడ్ చేసింది. కచ్చితంగా ఆదాయం వస్తుందని చెప్పి నన్ను నగదు ఇన్వెస్ట్ చేయమన్నారు. నా బ్యాంకు ఖాతా, నా భార్య బ్యాంకు ఖాతాల నుంచి రూ.42,31,600లను వారు తెలిపిన బ్యాంకు ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేశాను.’ అని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.


అతనికి రూ.69 లక్షల ఆదాయం వస్తుందని ఆ మోసగాళ్లు నమ్మించారు. అయితే ఆ డబ్బులు విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించినప్పుడు మరో రూ.11,000 వారు డిమాండ్ చేశారు. అప్పుడు కానీ తాను మోసపోయిన విషయం అతనికి అర్థం కాలేదు. దీంతో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


వీరిపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరు ప్రస్తుతం ఆ మోసగాళ్లను ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇటువంటి మెసేజ్‌లు మీకు వస్తే మీరు ఏమాత్రం స్పందించకండి. ఊరికే ఎవరూ ఎవరికీ డబ్బులు ఇవ్వరన్న సంగతి గుర్తుంచుకోండి. ఆ నంబర్లను బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి.


భారతదేశంలో పెరుగుతున్న ఇంటర్నెట్ వాడకంతో పాటే సైబర్ నేరం కేసుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. చెప్పుల షాపింగ్ నుంచి ఆహారం ఆర్డర్ చేయడం వరకు అన్ని రకాల పనుల కోసం ప్రజలు ఇంటర్నెట్‌ ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం రకరకాల వెబ్‌సైట్లను ఆశ్రయిస్తున్నారు. వీటిలో కొన్ని నమ్మకమైన వెబ్‌సైట్లు అయితే, మిగిలినవి ఫేక్‌ సైట్లు. ఫేక్‌ సైట్లలో సైబర్‌ నేరగాళ్లు పొంచి ఉంటారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ప్రజల నమ్మకాన్ని చూరగొన్న సైట్లలోనూ ఇప్పుడు మోసాలు వెలుగు చూస్తున్నాయి. కాబట్టి, ఆన్‌లైన్‌లో షాపింగ్‌ లేదా ఆర్డర్‌ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. 


స్థిరాస్తి క్రయవిక్రయం లేదా అద్దె కోసం కూడా చాలా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు ఇంటర్‌నెట్‌లో దర్శనమిస్తున్నాయి. మన దేశంలోని ఐటీ సిటీ బెంగళూరులో, ప్రముఖ రియల్ ఎస్టేట్ పోర్టల్ "నోబ్రోకర్‌" (NoBroker) ద్వారా జరిగిన ఒక మోసం కేసు  వెలుగులోకి వచ్చింది. ఈ పోర్టల్‌ ద్వారా, కొంతమంది వ్యక్తులు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను రూ. 1.60 లక్షలు మేర మోసం చేశారు.