Kajal Aggarwal : ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ నటించిన 'కరుంగాపియం' మూవీ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. మొదట ఏప్రిల్ 7, 2023న విడుదల చేయాలనుకున్న ఈ సినిమా.. కొన్ని కారణాల వల్ల థియేటర్లలోకి రాలేదు. ఇప్పుడు మే 19, 2023న విడుదల చేయడానికి మేకర్స్ షెడ్యూల్ చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, జనని, రైజా విల్సన్ (బిగ్ బాస్ తమిళ్ ఫేమస్), ఇరానియన్ నటి నోయిరికా ప్రధాన పాత్రలు పోషించారు. వీరితో పాటు ఇతర నటీనటులు ఆధవ్ కన్నదాసన్, కలైయరసన్, యోగి బాబు, అదితి రవీంద్రనాథ్, TSK,షెర్లిన్ సేథ్, లొల్లు సభ మనోహర్ లు పలు పాత్రల్లో నటించారు. 'కరుంగాపియం'.. పేవ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై పదర్తి పద్మజ నిర్మించగా, ప్రసాద్ ఎస్‌ఎన్ సంగీతం సమకూర్చారు.  


దర్శకుడు డీకే దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'కరుంగాపియం'.. ఐదుగురు వ్యక్తుల జీవితాలను చూపించే కథాంశంతో సాగనున్నట్టు సమాచారం. చెన్నై, ఉడుమలైపేట్టై, పొల్లాచ్చి వంటి పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ సినిమాలో కాజల్ పాత్రకు సూపర్ ఉందని డైరెక్టర్ ఇంతకుముందే ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. అయితే తమ అభిమాన హీరోయిన్లను వెండితెరపై త్వరలోనే చూడాలని ఆశించిన ఫ్యాన్స్ కు మేకర్స్ షాక్ ఇచ్చారు. అప్పట్లో ఏప్రిల్ 7న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ కొన్ని ఊహించని కారణాల వల్ల అది కాస్తా వాయిదా పడింది. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా ఈ మూవీ విడుదలపై స్పందించిన చిత్ర నిర్వాహకులు.. కరుంగాపియంను మే 19న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. 



ఇక పెళ్లి తర్వాత దూకుడు పెంచిన కాజల్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. 'కరుంగాపియం' ఇప్పటికే పూర్తి కాగా.. ప్రస్తుతం 'పారిస్ పారిస్'.. 'క్వీన్ రీమేక్' వంటి తమిళ సినిమాలు చేస్తోంది. వీటికి తోడు 'ఉమా' అనే ఓ హిందీ సినిమాలో, 'ఇండియన్ 2', 'NBK 108'లో కూడా చేస్తోంది. ఇదిలా ఉండగా ఈ భామ నటించిన లేటెస్ట్ సినిమా 'ఘోస్టీ'.. ఇటీవలే విడుదలై డిజాస్టర్ అయ్యింది.
 
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తోన్న 'ఇండియన్ 2'లో కాజల్ ఓ కీలకపాత్రలో నటిస్తుండగా.. ఈ సినిమా మొదలై, కొన్నాళ్లు షూటింగ్ జరుపుకుని ఆగిపోయింది. ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లినప్పటీ నుంచి ఏదో ఒక రూపంలో అవాంతరాలు వస్తున్న విషయం తెలిసిందే.  సెట్లో ప్రమాదం జరగడం.. ఆ తర్వాత నటుడు వివేక్‌ మృతి, దీనికి తోడు దర్శకుడు శంకర్‌కు, లైకా ప్రొడక్షన్స్‌ మధ్య అభిప్రాయ భేదాలు రావడం ఇలా అనేక కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.


కాజల్ సెకండ్ ఇన్నింగ్స్‌‌లో అడుగుపెట్టినా.. మునుపటి కారెక్టర్స్ పైనే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. యంగ్ హీరోలతో చేయాలనే ఉద్దేశంతో పెళ్లి తర్వాత కూడా గ్లామర్ పాత్రలకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పట్లేదు. ఎప్పటికప్పుడు క్రేజీ ఫోటోషూట్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని సినిమాలు చేస్తున్నందున కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ పర్లేదనిపిస్తుంది కానీ ఒకప్పట్లా ఆమె కోరుకుంటున్న ఆఫర్స్ మాత్రం రావట్లేదు. పెళ్లైపోయింది కాబట్టి సీనియర్ అనే ముద్ర పడిపోయిందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఒకప్పుడు చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్స్‌తో నటించిన ఆమెకు.. ఇప్పుడంతా సీనియర్స్ నుంచే పిలుపు వస్తుండడం గమనార్హం.