ప్రపంచ వ్యాప్తంగా AI టెక్నాలజీ రోజు రోజుకు మరింత విస్తరిస్తోంది. ఈ సాంకేతికతతో పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా టెక్ దిగ్గజాలు AIని బాగా వినియోగించుకుంటున్నాయి. రీసెంట్ గా సింగపూర్ నేషనల్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు AI టెక్నాలజీని మరింత డెవలప్ చేసే పనిలో పడ్డారు.  ఏకంగా మనిషి మైండ్ ను రీడ్ చేసే సాంకేతికతను సృష్టించారు. దీని సాయంతో మనిషి తన మనసులో ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకునే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. 


మనిషి ఆలోచనలను చవిదే AI టెక్నాలజీ


మైండ్ రీడింగ్ AI సాంకేతికతను డెవలప్ చేసే పరిశోధన బృందంలోని లి రుయిలిన్ కీలక విషయాలు వెల్లడించారు. “ప్రతి ఒక్కరికి ఇతరులు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. వారు ఏం ఆలోచిస్తున్నారు? ఏం చేయాలి అనుకుంటున్నారు? అని ఆరా తీస్తారు. అందుకే, మైండ్ రీడింగ్ AI టెక్నాలజీని రూపొందించాలని అనుకున్నాం. అందులో భాగంగానే ముందు నా మీదే ప్రయోగం చేయాలి అనుకున్నాం. నా మెదడును ఎంఆర్ఐ స్కాన్ చేశారు. నిజంగా నేను ఆలోచించినదే రిపోర్టులో వచ్చింది. ఈ టెక్నాలజీ ఆలోచనలను చదివే అవకాశం కల్పిస్తోంది” అని వెల్లడించారు.


మైండ్-రీడింగ్ AIని అభివృద్ధి చేయడంలో పనిచేస్తున్న పరిశోధకులకు 58 మంది తమ మైండ్ ను స్కాన్ చేసి పరిశోధన చేసుకోవచ్చని స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వారిలో లి రుయిలిన్ కూడా ఉన్నారు. ఈ టెక్నాలజీ పూర్తిగా మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) మెషీన్‌లో మెదడును స్కాన్ చేయడంపై ఆధారపడి ఉంటుంది. ఈ స్కాన్ లో బ్రెయిన్ కు సంబంధించిన 1,200 నుంచి 5,000 విభిన్న చిత్రాలను తీస్తారు. వీటిని స్టడీ చేసి వారు ఏం ఆలోచిస్తున్నారు? అనే విషయాన్ని గుర్తిస్తారు.   


బ్రెయిన్ స్కాన్ ద్వారా ఆలోచలన గుర్తింపు


MinD-Vis అని పిలువబడే  మైండ్ రీడింగ్ AIని ఉపయోగించి మెదడు స్కాన్ ఇమేజెస్ ఆధారంగా వాలంటీర్లకు  సంబంధించిన వ్యక్తిగత AI మోడల్ సృష్టించబడుతుంది అన్నారు ప్రధాన పరిశోధకులలో ఒకరైన జియాక్సిన్ క్వింగ్.  “ముందుగా వ్యక్తిని స్కాన్ చేస్తాం. వారికి నుంచి సరిపడ డేటా సేకరిస్తాం. వారికి సంబంధించి ఒక వ్యక్తిగత AI మోడల్‌ను రూపొందిస్తాం. ఈ మోడల్ ఒక రకమైన అనువాదకుడిగా పని చేస్తుంది. మెదడు కార్యకలాపాలను అర్థం చేసుకుంటుంది. ChatGPT మనుషుల సహజ భాషలను అర్థం చేసుకున్నట్లే. వాలంటీర్లను స్కాన్ చేసిన ప్రతిసారి వారి ఆలోచనల తాలూకు వివరాలు రికార్డు అవుతాయి. మెదడు కార్యకలాపాలు  AI మోడల్‌ లోకి వెళ్తాయి.  ఈ మోడల్‌ మెదడు కార్యకలాపాలను అర్థం చేసుకుని ప్రత్యేక భాషలోకి అనువదిస్తుంది. అంటే మనసులో ఆలోచనలను చదువుతుంది. ఆ వివరాలను పరిశోధకులకు అందజేస్తుంది” అని  జియాక్సిన్ క్వింగ్ తెలిపారు.  


కొత్త టెక్నాలజీతో ముప్పు తప్పదా?


ఈ కొత్త టెక్నాలజీ ఒక్కోసారి మిస్ యూజ్ అయ్యే అవకాశం ఉందని  NUS అసోసియేట్ ప్రొఫెసర్ జువాన్ హెలెన్ జౌ తెలిపారు. ముఖ్యంగ ప్రైవసీ ఇతరుల ప్రైవసీ దెబ్బతినే అవకాశం ఉందన్నారు. మైండ్ రీడింగ్ AI  ద్వారా ఇల్లీగల్ గా ఇతరుల ఆలోచనలను తెలుసుకునే ప్రమాదం ఉందన్నారు. అందుకే ఈ టెక్నాలజీ ఉపయోగించే విషయంలో కఠినమైన మార్గదర్శకాలు, చట్టాలను కలిగి ఉండాలన్నారు.  


Read Also: 2024లో చాట్‌జీపీటీ దివాలా! రోజుకు రూ.5.8 కోట్ల ఖర్చే తప్ప దమ్మిడీ ఆదాయం లేదు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial