రిలయన్స్ జియో తన తొలి ల్యాప్ టాప్ ను విడుదల చేసింది. జియో బుక్ పేరిట అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని ప్రస్తుతం  గవర్నమెంట్‌ ఇ మార్కెట్‌ (GeM) పోర్టల్‌ లో అమ్మాకానికి ఉంచింది. ఈ ల్యాప్ టాప్ ఆఫర్ ధరను  రూ.19,500గా కంపెనీ ఫిక్స్ చేసింది. ప్రస్తుతం ఈ ల్యాప్ టాప్ జీఈఎం పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉండటంతో అందరూ కొనుగోలు చేసే అవకాశం లేదు. ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ సంస్థల్లో పని చేసే ఉద్యోగాలు మాత్రమే ఈ ల్యాప్ టాప్ ను కొనే ఛాన్స్ ఉన్నది. దీపావళి పండుగ నాటికి ఈ జియో ల్యాప్ టాప్ అందరికీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తున్నది. అయితే, కమర్షియల్ రేటు ఇంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. తొలిసారి జియో బుక్ ను ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌- 2022 ఈవెంట్ లో ప్రదర్శించారు.


జియో బుక్ ఫీచర్లు


⦿ జియో బుక్ 11.6 అంగుళాల హెచ్‌డీ డిస్ ప్లేను కలిగి ఉంటుంది.


⦿ 1366X767 పిక్సెల్స్‌  రిజల్యూషన్‌ తో పాటు  క్వాల్‌కామ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 665 ఆక్టా కోర్‌ ప్రాసెసర్‌ తో వచ్చింది. 


⦿ జియోఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ పై ఈ ల్యాప్ టాప్ రన్ అవుతుంది.


⦿ 2 జీబీ ర్యామ్‌ మాత్రమే ఉంది. ర్యామ్ ను పెంచుకునే అవకాశం లేదు.


⦿ యూఎస్‌బీ 2.0 పోర్ట్‌, 3.0 పోర్ట్‌, హెచ్‌డీఎంఐ పోర్టులను కలిగి ఉంది. 


⦿ యూఎస్‌బీ టైప్‌ సి పోర్టులను ఇందులో ఏర్పాటు చేయలేదు.


⦿ మైక్రోఎస్‌డీ కార్డు స్లాట్‌ ను మాత్రం అందిస్తుంది.


⦿ ఇక బ్లూటూత్‌, 4జీ మొబైల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ కనెక్టివిటీకి అవకాశం ఉంది. 


⦿ రెండు ఇంటర్నల్‌ స్పీకర్లతో పాటు మైక్రో ఫోన్లను కలిగి ఉంది.


⦿ 55.1- 60 ఏహెచ్‌ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంది.


⦿ జియో బుక్ బరువు 1.2 కిలోలు ఉంటుంది.


⦿ ఏడాది పాటు బ్రాండ్ వ్యారెంటీని అందిస్తుంది కంపెనీ.   


ఎవరికి ఉపయోగకరం?


వాస్తవానికి ఇందులో వాడిన ప్రాసెసర్ లేటెస్ట్ ది కాదు. గేమ్స్ బాగా ఆడే వారిని ఈ జియో బుక్ పెద్దగా ఆకట్టుకోదని చెప్పుకోవచ్చు. జియో కూడా ఈ ల్యాప్ టాప్ ను గేమర్లను దృష్టిలో పెట్టుకుని తీసుకురాలేదు. ఈ ధర, ఫీచర్లను గమనిస్తే విద్యార్థులకు ఎక్కువగా ఉపయోగపడేలా ఉంది. అటు తొలిసారి ల్యాప్ టాప్ వినియోగించాలని అనుకునే వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ సాధారణ వర్క్ చేసుకోవడానికి సహకరిస్తుంది. హెవీ వర్క్ చేసే వారికి అంతగా ఉపయోగపడదని చెప్పుకోవచ్చు.    


జియో 5జీ సేవలు ప్రారంభం


అటు 5జీ నెట్వర్క్ సేవలపై ఇప్పటికే జియో క్లారిటీ ఇచ్చింది.  దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని నాలుగు నగరాల్లో 5జీ బీటా ట్రయల్‌ సేవలను ఆరంభిస్తున్నామని ప్రకటించింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి నగరాల్లో ఈ సేవలను ఎంపిక చేసిన కస్టమర్లు సేవలు పొందచ్చని వెల్లడించింది. ఇతర నగరాల్లో కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు జియో తెలిపింది.