కార్ల్ పెయ్ నథింగ్ బ్రాండ్ తన మొదటి స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ (1)ను త్వరలో లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కు రానుందని తెలిపారు. యూకేలో నథింగ్ ఓ2 షాప్ అనే డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌తో భాగస్వామ్యం ఏర్పరచుకుంది.


గతేడాది మనదేశంలో నథింగ్ ఇయర్ 1 ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ లాంచ్ అయ్యాయి. ఇవి కూడా మనదేశంలో ఫ్లిప్‌కార్ట్‌లోనే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వీటి ధర రూ.5,999గా ఉంది. ఇప్పుడు నథింగ్ ఫోన్ (1) కూడా ఫ్లిప్‌కార్ట్‌లోనే లభించనుంది.


నథింగ్ ఫోన్ (1) మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. ఇండియా, యూకే, యూరోపియన్ దేశాల వంటి కీలక మార్కెట్లలో ఇది త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. నథింగ్ ఓఎస్ అనే కస్టం ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను ఇందులో అందించనున్నారు.


2021లో ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం విజయవంతం అయిందని, అందుకే అదే భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నామని నథింగ్ ఈ సందర్భంగా తెలిపింది. నథింగ్ సంస్థను ప్రారంభించినప్పుడు టెక్ ఇండస్ట్రీలో ఉత్సుకత తీసుకురావాలనుకున్నామని వ్యవస్థాపకుడు కార్ల్ పెయ్ అన్నారు. మరి నథింగ్ ఫోన్ (1) ఆ అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలంటే లాంచ్ అయ్యే దాకా వేచి చూడాల్సిందే!